దేశ చరిత్రలోనే తొలిసారిగా!: ప్రతీ రైతుకు రూ.5లక్షల భీమా, కేసీఆర్ ప్రకటన..
హైదరాబాద్: రైతు బంధు పథకంతో దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టుబడి సహాయం అందిస్తున్న తెలంగాణ సర్కార్.. ఇప్పుడు మరో ముందడుగు వేసింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా రైతులందరికీ రూ.5 లక్షల జీవిత భీమా సౌకర్యం కల్పించడానికి నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు.ఈ ఏడాది ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించి రైతులకు బీమా సర్టిఫికెట్లు అందిస్తామని వెల్లడించారు. రైతుల జీవిత బీమా పథకం రూపకల్పనపై శుక్రవారం ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం సీఎం ఈ ప్రకటన చేశారు.
ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు:
రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉంది.. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? వంటి వాటితో నిమిత్తం లేకుండా అందరికీ భీమా సౌకర్యం వర్తింపజేస్తామని తెలిపారు కేసీఆర్. అంతేకాదు, భీమా కోసం రైతు నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోబోమని, ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. రైతు భీమా పథకం కోసం అవసరమయ్యే నిధులను బడ్జెట్ లోనే కేటాయిస్తామని ప్రకటించారు.
ఎల్ఐసీ ద్వారా అమలు:
విశ్వసనీయత, విస్తృత యంత్రాంగంఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ ద్వారా భీమా పథకం అమలు చేస్తామని తెలిపారు. భీమా ఉన్న రైతు.. సాధారణ మరణం చెందినా, లేక ప్రమాదవశాత్తూ చనిపోయినా.. నామినీకి ది రోజుల్లోగా రూ.5 లక్షల బీమా పరిహారం చెల్లించేలా ఈ పథకం ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం ప్రమాద భీమా అయితే ప్రభుత్వంపై వ్యయ భారం ఎక్కువయ్యేదని, కానీ ఎంత ఖర్చయినా మరణించిన ప్రతీ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలన్న బాధ్యతతో ఈ భీమా పథకాన్ని తీసుకొస్తున్నట్టు సీఎం చెప్పారు.
వ్యయం ఎక్కువైనా.. ప్రభుత్వమే భరిస్తుంది:
'తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులే అధికం. దాదాపు 93 శాతం మంది ఉన్నారు. ఒక్క ఎకరంలోపు భూమి ఉన్న వారు 18 లక్షల మంది. వారికి భూమి తప్ప మరో జీవనాధారం లేదు. ఏదేని పరిస్థితుల్లో రైతు చనిపోతే ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఉంటే ఆ కుటుంబానికి ఆసరా ఉంటుంది.
కేవలం ప్రమాద బీమా వర్తింపచేయడం వల్ల ప్రభుత్వానికి భారం తక్కువగా ఉన్నప్పటికీ, రైతులకు పెద్దగా లాభం ఉండదు. కాబట్టి వ్యయం ఎక్కువైనా సరే సాధారణ మరణాలకు కూడా వర్తించే విధంగా జీవిత బీమా చేయాలని నిర్ణయించాం.' అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
భీమా నియమ నిబంధనలు:
18-59ఏళ్ల వయసు ఉన్నవారికే మాత్రమే భీమా వర్తిస్తుంది. 60ఏళ్ల వయసు దాకా భీమా సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
భీమా కోసం ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీనే ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రతీ ఏడాది అగస్టు 15న ఆధార్ కార్డు ప్రామాణికతతో భీమా కోసం పేర్లు నమోదు చేసుకుంటారు.
వ్యవసాయ అధికారులు క్లస్టర్ల వారీగా 18-59ఏళ్ల వయసు ఉన్నవారిని భీమా పరిధిలోకి తీసుకొస్తారు. జాబితా సిద్దమయ్యాక ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది. ఆపై అగస్టు 15న ఎల్ఐసీ ఆ సర్టిఫికెట్లను పంపిణీ చేస్తుంది.
భీమా పరిహారం రూ.5లక్షలకు నామినీగా ఎవరిని ప్రతిపాదించాలనే విషయంలో రైతులకే పూర్తి స్వేచ్చ ఇచ్చారు.
డెత్ సర్టిఫికెట్ సమర్పిస్తే చాలు.. రైతు మరణించిన 10రోజుల్లోగా భీమా డబ్బును అధికారులు అందజేస్తారు. 10రోజుల్లోగా ఆ డబ్బు రాకపోతే ఎల్ఐసీకి జరిమానా విధిస్తారు.
దేశ చరిత్రలోనే తొలిసారిగా: ఎల్ఐసీ
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న రైతులకు జీవిత భీమా సదుపాయం దేశ చరిత్రలో, భీమా సంస్థల చరిత్రలో సరికొత్త రికార్డు అని ఎల్ఐసీ ప్రకటించింది. గతంలోనూ ఇలాంటి గ్రూపు ఇన్సూరెన్సులు ఉన్నప్పటికీ.. తక్కువ మంది సభ్యులకు మాత్రమే భీమా ఇచ్చేవారని, అది కూడా లక్ష నుంచి రెండు లక్షల బీమా ఉండేదని ఆ సంస్థ చెప్పింది.
ప్రభుత్వంపై భారం పడకుండా కేవలం ప్రమాద భీమాను మాత్రమే వర్తింపజేసేవారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఎంత వ్యయమైనా సరే రైతులకు మేలు చేస్తోందని ఎల్ఐసీ అభిప్రాయపడింది. రైతులందరికీ ఒక్కొక్కరికీ రూ.5 లక్షల భీమా చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని పేర్కొంది. ఇన్ని లక్షల మందిని సభ్యులుగా చేర్చి గ్రూపు ఇన్సూరెన్సు చేయడం కూడా దేశ చరిత్రలో, ఇన్సూరెన్సు కంపెనీల చరిత్రలో ఎన్నడూ లేదని ఎల్ఐసీ అధికారులు తెలిపారు.