సింగరేణి ఎన్నికలు: వారసత్వ ఉద్యోగాలపై కెసిఆర్ ట్విస్ట్
హైదరాబాద్: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కోల్పోకుండా చర్యలు తీసుకొంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.కారుణ్య నియామాకాల పేరుతో వారసత్వ ఉద్యోగాలను సింగరేణిలో చేపడతామన్నారు కెసిఆర్.సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భారీ మెజారిటీతో విజయం సాధిస్తోందని కెసిఆర్ ధీమాను వ్యక్తం చేశారు.
శుక్రవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సింగరేణి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఒక్కసారి విజయం సాధించి కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని కెసిఆర్ గుర్తు చేశారు.
సింగరేణి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఓడించేందుకు మూడు జాతీయ కార్మిక సంఘాలు ఏకమయ్యాయని కెసిఆర్ విమర్శించారు. గతంలో ఎన్నికలు జరిగిన చోట విపక్షాలు కూటమిగా పోటీచేసిన ప్రజలు టిఆర్ఎస్కే పట్టం కట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
సింగరేణిలోని 11 డివిజన్లలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని కెసిఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
కారుణ్య నియామాకాలు
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను కోల్పోకుండా చర్యలు తీసుకొంటానని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామాకాల కింద రిక్రూట్ చేస్తామని కెసిఆర్ చెప్పారు. కారుణ్య నియామాకాల కింద ఉద్యోగాల నియామాకంపై జాతీయ కార్మిక సంఘాల అభిప్రాయం ఏమిటో చెప్పాలని కెసిఆర్ ప్రశ్నించారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో జాతీయ కార్మిక సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని కెసిఆర్ ఆరోపణలు గుప్పించారు.
ఉద్యోగం వద్దనుకొంటే రూ. 25 లక్షల పరిహరం
సింగరేణిలో వారసత్వ ఉద్యోగానికి అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగం తీసుకోకపోతే రూ.25 లక్షలను పరిహరంగా ఇస్తామని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు. వారసత్వ ఉద్యోగాల రిక్రూట్ మెంట్ జరగకుండా సుమారు 17 కేసులను కోర్టుల్లో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.వారసత్వ ఉద్యోగాల విషయంలో కేంద్రంపై పోరాటం చేస్తామని కెసిఆర్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా బొగ్గుగనులున్న ప్రాంతాల రాష్ట్రాలను కలుపుకొని కేంద్రంపై పోరాటం చేస్తామని కెసిఆర్ చెప్పారు.
రూ. 6 లక్షల వడ్డీలేని రుణం
సింగరేణి కార్మికులకు రూ.6 లక్షలకు వడ్డీలేని రుణం ఇవ్వనున్నట్టు తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రకటించారు. గృహ నిర్మాణాల కోసం ఈ రుణాలు చెల్లించనున్నట్టు చెప్పారు. అయితే నయా పైసా వడ్డీ కూడ వసూలు చేయమని కెసిఆర్ చెప్పారు. దసరా అడ్వాన్స్ ను గతంలో రూ.8వేల రూపాయలు ఇచ్చేవారని కెసిఆర్ గుర్తుచేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దసరా అడ్వాన్స్ రూ. 25 వేలు ఇస్తున్నట్టు చెప్పారు.రూ.175 కోట్ల సింగరేణి కార్మికుల వృత్తి పన్నును రద్దుచేసిన ఘనత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చెప్పారు.సింగరేణి లాభాల్లో కార్మికులకు 25 శాతం లాభాలను పంచిన ఘనత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానిదేనని కెసిఆర్ చెప్పారు.
బోగస్ ఉద్యోగులను రెండు నెలల్లో క్రమబద్దీకరిస్తాం
సింగరేణిలో బోగస్ ఉద్యోగులను రెండు నెలల్లో క్రమబద్దీకరిస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్ చెప్పారు. సింగరేణిలో సుమారు 14 నుండి 19 వేల మంది ఉంటారని చెప్పారు.బోగస్ ఉద్యోగులను ప్రతి ఒక్కరూ బెదిరిస్తారని చెప్పారు. దీంతో బోగస్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని కెసిఆర్ చెప్పారు.వారసత్వ ఉద్యోగాల విషయంలో 3527 మంది తమకు అనుకూలంగా ఓటు చేస్తారని కెసిఆర్ చెప్పారు.
ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు
1980లో సింగరేణిలో ఒక్క కొత్త ఉద్యోగం కూడ ఇవ్వలేదని తెలంగాణ సిఎం కెసిఆర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే సింగరేణిలో ఉద్యోగాల నియామకం ప్రారంభమైందని కెసిఆర్ చెప్పారు. వారసత్వ ఉద్యోగాలను రద్దు చేసేందుకు ఎఐటీయూసీ ఒప్పుకొందని కెసిఆర్ గుర్తుచేశారు. సింగరేణిలో ఇప్పటివరకు 6 దఫాలు ఎన్నికలు జరిగితే ఎఐటీయూసీ, ఐఎన్టీయూసీలు మాత్రమే విజయం సాధించాయని ఆయన గుర్తుచేశారు. అయితే గత ఎన్నికల్లోనే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించినట్టు కెసిఆర్ చెప్పారు. తాము విజయం సాధించిన తర్వాత సింగరేణి కార్మికుల కోసం అనేక పథకాలను చేపటినట్టు కెసిఆర్ చెప్పారు.
బయ్యారం మైనింగ్కు సింగరేణికి అప్పగిస్తాం
చైనాలో బొగ్గు గనుల్లో ఏ రకమైన పద్దతులను ఆ ప్రభుత్వం అవలంభిస్తోందో సింగరేణిలో కూడ అదే తరహ పద్దతులను అవలంభించనున్నట్టు కెసిఆర్ చెప్పారు. విదేశాల్లో అత్యుత్తమ విధానాలను సింగరేణిలో కూడ అవలంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రతి నెలా సింగరేణిపై రెండు గంటల పాటు సమయాన్ని కేటాయించి సమీక్షించనున్నట్టు చెప్పారు.
జర్నలిస్టులకు నెల రోజుల్లో ఇళ్ళ స్థలాలు
తెలంగాణ జర్నలిస్టుందరికీ సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. జర్నలిస్టులందరికీ సీఎం దసరా శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.రాబోయే 25 రోజుల్లో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని ఉద్ఘాటించారు. జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు పెంచుతామని ప్రకటించారు. దసరా పండుగ తర్వాత అల్లం నారాయణతో సమావేశం ఏర్పాటు చేసి ఇండ్ల స్థలాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 2 లేదా 3 ప్రాంతాల్లో ఇండ్ల స్థలాల పరిశీలన జరిగిందని సీఎం తెలిపారు. వీలైతే ఒకే చోట ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇండ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు కూడా ఒకే చెప్పేసిందని వెల్లడించారు సీఎం.