కేటీఆర్ పంచ్ : మామూలుగా పేలలేదు..
మాటలు నేర్వని నేతలకు ఇప్పటి రాజకీయాల్లో మైలేజ్ రావడం కష్టమే. మీడియా ఫోకస్ ఉండాలన్నా.. జనంలో మాస్ ఫాలోయింగ్ పెరగాలన్నా.. మాటలతో అందరి దృష్టిని ఆకర్షించగల నేర్పుండాలి. ఈ విషయంలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ని మించింది లేదు. పార్టీలోని అగ్ర నేతలంతా మంచి వాక్చాతుర్యం ఉన్నవాళ్లే. ముఖ్యంగా తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న మంత్రి కేటీఆర్ కూడా మంచి మాటకారి అన్న విషయం అందరికీ తెలిసిందే.
తాజాగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోను తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. వారసత్వ రాజకీయాలంటేనే తనకు గిట్టదని చెప్పుకొచ్చిన కేటీఆర్.. సీఎం అవ్వాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన తండ్రి అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మరో 15 ఏళ్ల వరకు సీఎంగా ఉండాలన్నది తన కోరిక అని తెలిపారు.
పార్టీలోకి చేరికలు ఎక్కువవుతున్న క్రమంలో.. సొంత గూటి నేతల మధ్యే విబేధాలు తలెత్తే పరిస్థితి రాదా..! అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల తీరు కొందరికి నచ్చవచ్చునని, మరి కొందరికి నచ్చకపోవచ్చునని, వాళ్ల ఆలోచన ధోరణిపైనే అది ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు.
శాఖల మార్పుపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన కేటీఆర్.. అదంతా సీఎం నిర్ణయాలకు అనుగుణంగానే జరిగిందని, ఏ శాఖను కేటాయించినా చిత్తశుద్దిగా పనిచేయడానికి తాను సిద్దమని తెలియజేశారు. పార్టీలో చేరిన నేతలంతా శాశ్వతంగా ఉండిపోతారా.. అన్న ప్రశ్నకు బదులిస్తూ జీవితమే తాత్కాలికమని, ఏదీ పర్మినెంట్ కాదని ఓ పంచ్ డైలాగ్ కూడా వేశారు. ఇక అవినీతికి సంబంధించి సొంత గూటి నేతలనైనా ఉపేక్షించేది లేదన్నారు కేటీఆర్. మొత్తానికి ఏది మాట్లాడినా సమర్థనీయమే అన్న తరహాలో మెప్పించే ప్రయత్నం చేయడంలో కేటీఆర్ కూడా బాగానే ఆరితేరిపోయారు.