కేంద్రమంత్రి చెప్పింది పాటిస్తా: కెసిఆర్, టిడిపిలో చేరిన కృష్ణప్రసాద్, 300 మంది
మెదక్/హైదరాబాద్: మెదక్ జిల్లాలోని ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్, అటవీ కళాశాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కేంద్రమంత్రులు రాధామోహన్ సింగ్, బండారు దత్తాత్రేయలతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడారు. 1,300 ఎకరాల్లో మూడు ఇనిస్టిట్యూట్స్ ప్రారంభించుకున్నందుకు గజ్వేల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్లో రూ.50 కోట్లతో అటవీ కళాశాల ఏర్పాటు కాబోతుందన్నారు.
ఒంటిమామిడి మార్కెట్లో రూ.20 కోట్లతో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాధా మోహన్ సింగ్తో మరోసారి సమావేశమై యూనివర్సిటీ అభివృద్ధిపై చర్చిస్తామన్నారు. తెలంగాణ ప్రజల తరపున రాధామోహన్సింగ్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆయన చేసిన సూచనలు పాటిస్తామన్నారు. రాష్ట్రంలో గోడౌన్ల కొరత ఉందని, వాటి నిర్మాణానికి సహకరించాలని కోరారు. దేశంలో అతితక్కువ ఫారెస్ట్ కాలేజీలు ఉన్నాయని, హార్టికల్చర్ వర్సిటీ, రీసెర్చ్ సెంటర్ తెలంగాణ రాష్ట్రానికి విశిష్ట సేవలు అందిస్తుందన్నారు.
త్వరలోనే అద్భుతమైన ప్రయోగశాలలు రాబోతున్నాయన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో విత్తనాల తయారీ జరుగుతోందన్నారు. తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏప్రిల్ 3న గజ్వెల్లో ఇంటింటికీ నల్లా పథకం ప్రారంభిస్తామన్నారు.
అంతకుముందు రాధామోహన్ సింగ్ మాట్లాడుతూ... కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. లక్ష్మణ్ బాపూజీ తెలంగాణకు గాంధీ వంటివారు అని కొనియాడారు. దేశంలో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక రైతు సంక్షేమంపై ప్రధానంగా దృష్టి పెట్టారన్నారు. గత పదేళ్లలో రైతును ఆదుకునేవారే కరువయ్యారని, అందుకే వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు.
టిడిపిలో చేరిన ఎస్వీ కృష్ణప్రసాద్
ఎల్పీ నగర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్వీ కృష్ణ ప్రసాద్ గురువారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు లోకేంద్రనాథ్,300 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.