అవును ఆ పిచ్చోడినని చెప్పా, నేనేదో చెప్తానని: అసెంబ్లీ రద్దుపై కేసీఆర్ ఊహించని ప్రకటన!
Recommended Video
హైదరాబాద్: రాజకీయంగా తెలంగాణకు, తెరాసకు ఏది మంచిదో, ఆ నిర్ణయం తీసుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడారు. గంటన్నర నుంచి రెండు గంటలు మాట్లాడుతారని, అసెంబ్లీ రద్దు లేదా ముందస్తు ఎన్నికలపై సంచలన ప్రకటన చేస్తారని గత కొద్ది రోజులుగా అందరిలోను ఉత్కంఠ నెలకొంది.
కానీ ఊరించి ఉసూరుమనిపించినట్లుగా.. అందరూ ఊహించింది ఒకటి. కానీ కేసీఆర్ మాట్లాడింది మరొకటి. అసెంబ్లీ రద్దు, ముందస్తు వంటి రాజకీయ పరమైన నిర్ణయాలపై తాను త్వరలో నిర్ణయం తీసుకుంటానని మాత్రమే చెప్పారు. కేసీఆర్ తన ప్రసంగంలో ఏం చేశాము, ఎలా చేశాము, అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశంపై, సంక్షేమ పథకాల పైనే మాట్లాడారు. త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని అంశాలు వెల్లడిస్తామని చెప్పారు.
అవును తెలంగాణ పిచ్చోడినని చెప్పా
తెలంగాణ కోసం తాను ఢిల్లీలో ఓ కమ్యూనిస్ట్ పార్టీ వద్దకు 38 సార్లు తిరిగానని, దానికి ఓ నేత తనను పిచ్చిడివానయ్యా అని అన్నారని, అప్పుడు తాను అవును నేను పిచ్చోడినేనని, తెలంగాణ పిచ్చోడినని ఆయనకు చెప్పానని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చాక కొత్త రాష్ట్రంలో ప్రజలు తెరాసను ఆశీర్వదించారని చెప్పారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో మన ప్రస్తానం ప్రారంభించామన్నారు. జయశంకర్ తెలంగాణకు ఆత్మ అన్నారు. తెలంగాణ వస్తే ఏం చేయాలనే విషయాన్ని జయశంకర్తో కలిసి ఎప్పుడో రాసుకున్నామని చెప్పారు. నేటి మిషన్ కాకతీయ 12 ఏళ్ల క్రితం జయశంకర్ కల అన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణే అన్నారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుస్తామన్నారు.
సమైక్య పాలనలో విధ్వంసం
సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణలో విధ్వంస పాలన సాగిందన్నారు. ఈ పాలనపై తాను కూడా ఏడ్చానని చెప్పారు. ఆ రోజు సిరిసిల్ల గోడలపై నాటి కలెక్టర్ రాయించిన రాతలు చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఆత్మహత్యలు పరిష్కారం కాదని రాశారని, అలా రాసుకునే దౌర్భాగ్యం రావడం దారుణం అన్నారు. తెలంగాణ వచ్చాక నేతన్నలు సంతోషిస్తున్నారని చెప్పారు. మనం ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు. నాటి సమైక్య పాలకులు చీఫ్ లిక్కర్ లాబీకి తలొగ్గి, నేతన్నల పొట్ట గొట్టారన్నారు. పారిశ్రామిక వృద్ధి మాత్రమే వృద్ధి అని, ఐటీ వృద్ధి అని చెబుతుంటారని, కానీ గొర్రెల పెంపకం కూడా అభివృద్ధేనని చెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో గొర్లు పంచగా, ఈ రోజు గొల్లకురుమలు ఆనందంగా ఉన్నారని చెప్పారు.
ఏడవడం చూసి సాయం చేశా
ఓ రోజు ఉద్యమం సమయంలో తాను వరంగల్ జిల్లా ములుగు ప్రాంతానికి వెళ్లానని, అప్పుడు బీమా నాయక్ అనే వ్యక్తి ఏడవటం తాను చూశానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఇంట్లో పెళ్లికి రూ.50వేలు తెచ్చి పెట్టుకుంటే కాలిపోయాయని కన్నీరుమున్నీరు అయ్యాయని, ఆయనకు తాను రూ.1 లక్ష ఇచ్చి, ఆ పెళ్లికి కూడా వెళ్లివచ్చానని చెప్పారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళితులు, పేదల ఇళ్లలోని వారికి పెళ్లిళ్లు చేశానని, ఇదే ఇప్పుడు ప్రభుత్వ పరంగా మేం తీసుకు వచ్చిన కళ్యాణలక్ష్మి అన్నారు. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు వంటి వాటిని అమలు చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ మాటలు చెప్పడని, చేసి చూపిస్తాడన్నారు. తెలంగాణలలో రైతులు అప్పుల్లో ఉన్నారని, అందుకే రైతు బంధు అన్నారు.
కేసీఆర్ ఏదో రాజకీయ నిర్ణయం తీసుకుంటారని..
మళ్లీ కేసీఆరే రావాలని ప్రజావాణి వినిపిస్తోందని కేసీఆర్ చెప్పారు. ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాతో పాటు గ్రామాల్లోకి టీవీ వాళ్లు వెళ్లినా ప్రజలు కేసీఆర్ను కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ ఏదో రాజకీయ నిర్ణయం తీసుకుంటారని, అసెంబ్లీ రద్దు తదితర అంశాలపై చెబుతారని మీడియా చెబుతోందని, కానీ ఏది మంచి నిర్ణయం అయితే అది తీసుకోవాలని, మంత్రి వర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తనకు అప్పగించారని కేసీఆర్ చెప్పారు. రాజకీయ పరమైన నిర్ణయాలు త్వరలో తీసుకుంటామన్నారు. ఇన్నాళ్లు జరుగుతున్న ప్రచారానికి ఊహించని విధంగా కేసీఆర్ తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసారు. కానీ త్వరలో నిర్ణయం ఉంటుందని మాత్రం చెప్పారు. కొత్త పథకాలు ప్రకటిస్తారని కూడా పత్రికలు రాశాయన్నారు. కానీ చెబితే అమలు చేయాల్సి ఉంటుందని, అది సరికాదని, కాబట్టి తాను అలా చెప్పదల్చుకోలేదన్నారు. జోన్ల వ్యవస్థపై మోడీని అడిగి తెచ్చుకున్నానని చెప్పారు.
ఢిల్లీకి గులాంగిరి చేద్దామా
టీఆర్ఎస్ అధికారంలో లేకుంటే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకుంటే రిజర్వేషన్లు అమలు అయి ఉండకపోయేవన్నారు. ఇది తమ నిబద్దత అన్నారు. మనం ఢిల్లీకి గులాంగిరి చేసేవారిగా ఉందామా, లేక స్వతంత్ర గులాబీలుగా ఉందామా ప్రజలు గమనించాలన్నారు. మనం ఢిల్లీకి బానిసలం కావొద్దన్నారు. నిర్ణయాధికారం మన చేతుల్లోనే ఉండాలన్నారు. కేంద్రం వద్ద బానిసలుగా కాకుండా తెలంగాణ జాతి ఐక్యం కావాలన్నారు. ప్రజలు మరోసారి తనను దీవిస్తే ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెప్పారు.