మామ కోరిక : మా అల్లుడిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించండి
సిద్దిపేట : మామ బొమ్మెస్తే అల్లుడు రంగేస్తాడు. మామ ఆర్డరేస్తే అల్లుడు పనులు చక్కబెడతాడు. మామ డైరెక్షన్ లో అల్లుడు కథ నడిపిస్తాడు. ఇంతకు ఎవరా మామ అల్లుళ్లు అనుకుంటున్నారా. మామనేమో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, అల్లుడేమో హరీశ్ రావు. అసలు విషయానికొస్తే.. ఎన్నికల పర్వంలో సిద్ధిపేట సమీపంలోని కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకున్న కేసీఆర్ తన అల్లుడు హరీశ్ రావు గురించి చేసిన కామెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
టీఆర్ఎస్ అభ్యర్థిగా సిద్దిపేట నుంచి బరిలో నిలిచిన హరీశ్ రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కేసీఆర్. ఇదే కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్. కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో మామ అల్లుళ్ల బంధం చెడిందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ముందస్తు ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్.. అక్కడి ప్రచార బాధ్యతలు చూసుకోవాల్సిందిగా హరీశ్ రావును పురమాయించారు. తాను పోటీచేస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో తిరుగుతూనే అటు గజ్వేల్ లోనూ చక్రం తిప్పుతున్నారు హరీశ్ రావు.
ఈక్రమంలో మామ అల్లుళ్ల చుట్టూ పెనవేసుకున్న బంధం చూసి ప్రత్యర్థులు పరేషాన్ అవుతున్నారు. అందుకే హరీశ్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలనే మాట కేసీఆర్ నోట రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాను పోటీచేసిన ఎన్నికల్లో ఏనాడు కూడా తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ ప్రజలను కోరకపోవడం కొసమెరుపు.