సాయం చేస్తాం: చెన్నై వరదపై కెసిఆర్ ఆందోళన, 'రియల్ హీరో' నటుడు సిద్ధార్థ
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం కావడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
జల ప్రళయం వల్ల చెన్నై అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. నగరం మొత్తం తటాకాన్ని తలపిస్తోంది. ఫోన్లు పనిచేయటం లేదు, విద్యుత్ సరఫరా లేదు, నిత్యావసరాలు లేవు, తాగటానికి మంచినీరు లేదు. ఇంతటి భయానక స్థితిలో డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో ఇంట్లో మరుగుదొడ్డిని కూడా వినియోగించుకోలేని దుస్థితి.
చెన్నై వాసులు నరకం అనుభవిస్తున్నారు. కనీసం సహాయ బృందాలు కదలడానికీ అనువుగా లేని బీభత్సంతో చెన్నై వణికిపోతోంది. కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, ఐటీ కంపెనీలు మూతపడ్డాయి. పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారు వర్ష బాధితులను తమ ఇంటికి సామాజిక మాధ్యమాల ద్వారా ఆహ్వానిస్తున్నారు. అవకాశమున్నవారు బాధితులకు ఆహారం అందిస్తున్నారు. వారంపాటు ఉచిత సేవలు అందిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఎయిర్ టెల్, రిలయన్స్, వొడాఫోన్ కంపెనీలు కూడా ఆఫర్లు ఇచ్చాయి.
సిద్ధార్థ్ సాయం
భారీ వర్షాలతో సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హీరో సిద్దార్ధ్ అక్కడి పరిస్థితిని వివరించారు. అంతేకాక తన ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండంటూ... కొన్ని ఫోటోలను కూడా సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
తన ఇంటి పరిస్థితిని అందులో చూపించాడు. తన ఇంటి పరిస్థితే ఇలా ఉంటే చెన్నై పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండంటూ సిద్దార్థ్ ఓ ట్వీట్ చేశారు. ఇంట్లో ఉండే పరిస్థితి లేక మేమంతా టెర్రస్ పైకి వెళ్తున్నామని, తమిళనాడుని ఆ దేవుడే కాపాడాలని ట్వీట్ చేశాడు.
మరోవైపు, చెన్నై వరదల నేపథ్యంలో సిద్ధార్థ్ రంగంలోకి దిగారు. తనవంతు సాయం చేస్తున్నారు. ఆయన రియల్ హీరోగా మారిపోయారు. చెన్నై వరదల గురించి ఎప్పటికప్పుడు ట్వీట్టర్ ద్వారా చెబుతూ, అవసరమైన వారికి సాయమందిస్తున్నారు. ఆహార ప్యాకెట్లు, నీళ్ల ప్యాకెట్లను సోషల్ సైట్ ద్వారా అడుగుతూ... వాటిని బాధితులకు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు.