ఆంధ్రావాళ్లూ మా బిడ్డలే, నారాయణ చెవి కోయకండి: కెసిఆర్, హద్దు దాటొద్దని హెచ్చరిక
హైదరాబాద్: హైదరాబాదీలు అంతా తెలంగాణవారేనని, మరాఠీలు అయినా, బెంగాళీ అయినా, ఆంధ్రా వాళ్లు అయినా అంతా తమ వారేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు. హైదరాబాద్ అంతా మాదే అన్నారు. హైదరాబాదీలంతా మా బిడ్డలే అన్నారు. ఇప్పుడు ఆంధ్రా వాళ్లు కూడా మాకు ఓటేయడం ద్వారా విపక్షాల పటాపంచలు తుడిచి పెట్టుకుపోయినట్లయిందని అభిప్రాయపడ్డారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తూ.. గతంలో ఏ పార్టీకి ఇవ్వనన్ని సీట్లు తమకు జంట నగరాల ప్రజలు ఇచ్చారని, వారికి తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. జిహెచ్ఎంసి ఏర్పాటయ్యాక 1956లో అత్యధిక 52 సీట్లు ఓ పార్టీ గెలుచుకుందని, మళ్లీ ఇప్పుడు గెలుచుకున్నామన్నారు.
ఇంతటి అపురూప విజయం అందించిన ప్రజలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. మా మీద ఇప్పుడు మరింత బరువు మోపారని చెప్పారు. ఈ ఓట్లు కష్టపడితే వచ్చినవి కావని, ఇష్టపడి ఓట్లేశారన్నారు. జర్నలిస్టులు సహా ప్రతి ఒక్కరు మాకే ఓట్లేశారని, అందుకే ఇంతటి విజయం సాధించామన్నారు.
పేదల అజెండానే మా అజెండాగా ముందుకు సాగుతామని చెప్పారు. ఉద్యమం సమయంలో, రాష్ట్రం వచ్చాక కూడా కొందరు అపోహలు సృష్టించారని, గ్రేటర్ ఎన్నికల్లోను వారు అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేశారన్నారు. టిఆర్ఎస్ అంటే మిగతా వారిని భయపెట్టే పరిస్థితి కనిపించిందన్నారు.
హైదరాబాదులో నిమిషం కూడా కరెంట్ పోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీపడమని చెప్పారు. ఎంత గొప్ప విజయం అందించారో, అంత గొప్ప సేవ చేసి నిరూపించుకుంటామని చెప్పారు. కార్పోరేట్ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రులు చేస్తామన్నారు.
హైదరాబాదును గ్లోబల్ సిటీగా చేస్తామన్నారు. ప్రజాతీర్పు విషయంలో ప్రతిపక్షాలు అర్థవంతమైన ప్రకటనలు చేయాలన్నారు. హైదరాబాదులో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. చంద్రబాబు, బిజెపి నేతలు ఎన్నో చెప్పారన్నారు. వారికి ప్రజలు షాకిచ్చారన్నారు.
సిపిఐ నేత నారాయణ తనకు మంచి మిత్రుడు అని, ఆయన చెవి జోలికి ఎవరూ వెళ్లవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. నారాయణ జోలికి ఎవరూ పోవద్దని కోరుకుంటున్నానని చెప్పారు. తెరాస వంద సీట్లు గెలుచుకుంటే చెవి కోసుకుంటానని నారాయణ అన్నారు.
ప్రతిపక్షాలు అర్థవంతమైన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో, ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు విపక్షాలకు షాకిచ్చారని చెప్పారు. వరంగల్ తర్వాత విపక్షాలు మారుతాయని భావించానని, కనీసం ఇప్పుడైనా మారాలని ఎద్దేవా చేశారు.
ఎక్స్ అఫీషియో సభ్యులు ఎప్పుడూ ఉన్నారని, గతంలోను వారు ఓటింగులో పాల్గొన్నారని కెసిఆర్ చెప్పారు. అయితే, భవిష్యత్తు కోసమైనా ఎక్స్ అఫీషియల్స్ ఉండాలన్నారు. మేం చట్ట ప్రకారమే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. లంచం పూర్తిగా రూపుమాపాలన్నారు. లంచం తీసుకోకుండా పని చేయాలన్నారు.
కెటిఆర్, రేవంత్ రెడ్డిల సవాల్ పైన కెసిఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సవాళ్లు సాధారణమే అన్నారు. వాటిని స్పోర్టివ్గా తీసుకోవాలన్నారు. అంతేకాదని సవాళ్లను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఎవరి లిమిట్లో వాళ్లు ఉండాలని, పరిధి దాటవద్దని, అలా ఉంటేనే మంచిదన్నారు. మేయర్ పదవి పైన మాట్లాడుతూ.. అందరం కూర్చొని మేయర్ ఎవరో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విపక్షాలను ప్రజలు ఎంత ఘోరంగా తిరస్కరించారో చూశారన్నారు.