ఆంధ్ర సిఎంలకు సంచులు మోసిన బతుకులు: కెసిఆర్ ఫైర్
కాంగ్రెసు నేతలపై తెలంగాణ సిఎం కెసిఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆంధ్ర సిఎంలకు సంచులు మోసిన బతుకులు వారివని వ్యాఖ్యానించారు.
మహబూబాబాద్ : ఆంధ్రా పాలనలో అప్పటి ముఖ్యమంత్రులు సంచులు మోసిన బతుకులు కాంగ్రెసు నేతలవి అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.. చంద్రశేఖర రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెసు నాయకులపై ఆయన శుక్రవారం మహబూబాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో తీవ్రంగా దుయ్యబట్టారు.
ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ నేతల కాళ్లకింద భూమి కదులుతోందని ఆయన అన్నారు. వారి పాలనలో ఏనాడూ ప్రజల పట్ల మంచి ఆలోచనలు చేయలేదని, ఎన్నికల్లో చీప్ లిక్కర్లు పంచడం తప్ప ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ నేతలకు పట్టదని ఆయన అన్నారు.
వారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే వారికి నిద్రపట్టడం లేదన్నారు. కాంగ్రెసు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని కెసిఆర్ అన్నారు.
వారు ఓటు బ్యాంకుగానే చూశారు..
దేశంలో ఏ ప్రభుత్వానికి రాని అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని, దేశ ప్రజలు వారికి 40 సంవత్సరాలు అవకాశమిచ్చారని, అయినా కాంగ్రెస్ పాలకులు అభివృద్ధి చేయలేదని, ప్రజలను వారు ఓటు బ్యాంకులుగా చూశారు తప్ప వారి క్షేమం గురించి ఆలోచించలేదని విమర్శించారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీని అభివృద్ధి చేయమని ప్రజలు ఆశీర్వదించి అధికారంలో కూర్చొబెట్టారని సీఎం అన్నారు.
ప్రాజెక్టులు కడుతుంటే ప్రజలను రెచ్చగొడుతున్నారు...
అరవై ఏళ్ల పాటు వెనకబాటుకు గురైన రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్టు కడదామని తలపెట్టినా అడుగడుగునా అడ్డుకుంటున్నారని, దాని కోసం ఒక బ్యాచ్ తయారైందని, తెలంగాణలో ఏమూలన ప్రాజెక్టు కోసం శంకుస్థాపన జరిగినా అక్కడి ప్రజలను రెచ్చగొట్టి ప్రాజెక్టును ఎలాగైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కెసిఆర్ అన్నారు.
ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు..
పర్యావరణ అనుమతుల్లేవని గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్తున్నారని, ఇంతకన్న దౌర్భాగ్యం ఇంకోటి ఉండదనికేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులు కట్టలేదని, ప్రాజెక్టు కట్టే ముందు పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తారని చెప్పారు.
ఆలస్యం కాకూడదనే ఇలా..
ఆలస్యం కాకూడదని, ఆ అనుమతులు వచ్చేలోపు పనులు ప్రారంభించడం తప్పా? అని కెసిఆర్ ప్రశ్నించారు దీనిపై కొంత మంది కాంగ్రెస్ నేతలు గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లి ప్రాజెక్టులను ఆపుతున్నారని, ఇది ప్రజల అభివృద్ధి కోరుకునేవారు చేసే పని కాదని, అభివృద్ధి నిరోధకులే ఇలాంటి పనులు చేస్తారని ఆయన అన్నారు.