నాతో సోనియా ఏమన్నారంటే: నాటి ముచ్చట్లపై కేసీఆర్ సంచలనం, మాతో కలిసేందుకు కాంగ్రెస్ నేతల ఫోన్లు
హైదరాబాద్: అయిదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తోంది. తెలంగాణ రాగానే సోనియా కాళ్లు పట్టుకొని, ఇప్పుడు విమర్శలు చేస్తావా, పార్టీని విలీనం చేస్తానని చెప్పి, మాట తప్పుతావా అని కాంగ్రెస్ నేతలు నిత్యం దుమ్మెత్తి పోస్తున్నారు.
అయితే ఆ రోజు ఏం జరిగిందనే విషయం కేసీఆర్ చెప్పిన దాఖలాలు దాదాపు లేవు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీగా ఎన్నికైన అనంతరం ఆయన మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేయమని చెప్పా
అప్పుడు తెలంగాణ రాష్ట్రం రాగానే తాను సోనియా గాంధీ వద్దకు వెళ్లానని కేసీఆర్ చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీలో తెరాసను విలీనం చేయమని తన వద్ద ప్రతిపాదన పెట్టారని చెప్పారు. ఆ ప్రతిపాదన రాగానే తాను కూడా విలీనం చేసినా కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉండదని చెప్పానని తెలిపారు. అయినప్పటికీ విలీనానికి అంగీకరించానని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తనను చేయమని అడిగానని చెప్పారు.
విజయశాంతితో పాటు వారిని చేర్చుకొని అవమానించింది
కానీ వారు మాత్రం, తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ ఉనికే ఉండదని చెప్పారని కేసీఆర్ చెప్పారు. తమ పార్టీ ఉనికిని అవమానించారని వాపోయారు. అంతేకాకుండా తమ పార్టీలో కీలకంగా ఉన్న విజయశాంతితో పాటు పలువురు నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. అలా తెరాసను కాంగ్రెస్ తీవ్రంగా అవమానించిందని మండిపడ్డారు.
టీఆర్ఎస్లోకి వస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోన్లు
కానీ, 2014 ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేసి గెలిచామని కేసీఆర్ చెప్పారు. ఈ ఎన్నికల్లో నేను ఊహించినన్ని సీట్లు గెలుచుకోలేకపోయామని అన్నారు. తాను 95 నుంచి 106 సీట్లు వస్తాయని భావించానని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెరాసలోకి వస్తామని ఫోన్లు చేస్తున్నారని అన్నారు. పంచాయతీ ఎన్నికలు తమకు పెద్ద సవాల్ అన్నారు. ఓడిపోయిన మంత్రులను కేబినెట్లోకి తీసుకుంటే విమర్శలు వస్తాయని చెప్పారు.
ఏపీకి వెళ్లడంపై కేసీఆర్
తాను వంద శాతం ఆంధ్రప్రదేశ్ వెళ్తానని కేసీఆర్ చెప్పారు. ఏపీ నుంచి తనకు ఆహ్వానాలు అందుతున్నాయని అన్నారు. తెలంగాణలో అప్పులు ఎక్కువయ్యాయని కొందరు విమర్శలు చేస్తున్నారని, కానీ తమకు అన్నింటి పైన అవగాహన ఉందని చెప్పారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలతో కలిసి కొత్త జాతీయ పార్టీని తీసుకు వస్తామని చెప్పారు. దానికి ఇంకా పేరు పెట్టలేదని చెప్పారు.
16 లోకసభ స్థానాలు గెలిచాం
పార్టీ నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ... వచ్చే మూడు నెలల్లో ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాలు ఉండాలని చెప్పారు. పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆమోదం మనవైపే ఉందని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో పాతబస్తీ మినహా 16 సీట్లలో మనమే గెలుస్తామని చెప్పారు. హైదరాబాదును మజ్లిస్ పార్టీ గెలుచుకుంటుందని తెలిపారు. మిషన్ భగీరథ పనులు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసేలా పర్యవేక్షణ ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కేసీఆర్ పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు. ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండాలని చెప్పారు.