అందరికీ ఒకే స్కూల్: కేజీ టు పీజీ సమీక్షలో కేసీఆర్(ఫొటో)
హైదరాబాద్: ఒకే స్కూలు, ఒకే సిలబస్, ఒకే భోజన మెనూ, ఒకే పద్ధతి ఒకే పరీక్షల విధానం ఉండేలా కామన్ స్కూలు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలిపారు. తెలంగాణలో కేజీ టు పీజీ విద్యా విధానం అంశంపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.వచ్చే ఏడాది నుంచి కేజీ టూ పీజీ విద్యను ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. నియోజకవర్గానికో రెసిడెన్షియల్తో నిర్వహణలోని సాధక బాధకాలను గమనించాకే, మరుసటి ఏడాది నుంచి గురుకులాలను విస్తరిస్తామని చెప్పారు.
రాష్ట్రమంతా ఒకే తరహా పాఠశాలలు, ఒకే సిలబస్, ఒకే భోజనం మెనూ, ఒకే పద్ధతి, ఒకే పరీక్షల విధానం ఉండాలని చెప్పారు. కుల మతాల గురించి పట్టింపు లేకుండా పిల్లలందరూ ఒకే చోట చదవడం వల్ల అంతరాలు లేని సమాజం సృష్టించవచ్చని సీఎం అభిలషించారు. తెలంగాణ రాష్ట్రం అవలంబించే నూతన విద్యా విధానం, వృత్తి నైపుణాన్ని పెంచే విధంగా, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు పోటీ పడేలా ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మన విద్యావిధానం భావితరాలను ఉత్తమ పౌరులుగా, దేశానికి ఉపయోగపడే మానవ వనరులుగా తయారు చేసే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. విద్యపై ఖర్చు వృథా పెట్టుబడి అనే నీచ ప్రచారంకూడా గతంలో జరిగిందని, ఫలితంగా ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రమాణాలు దెబ్బతిన్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం విద్యపై పెట్టే ఖర్చును అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమంగా భావిస్తున్నదని చెప్పారు. కేజీ టు పీజీ విద్యా విధానాన్ని ఏ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాలి? ఏ వయస్సు నుంచి పిల్లలు హాస్టల్లో ఉండడం మంచిది? విద్యా బోధన చేయడానికి ప్రభుత్వం ఉన్న ఉపాధ్యాయులు సరిపోతారా? వారికి అదనంగా ఏమైనా శిక్షణనివ్వాలా? బోధన అంశాలు ఎలా ఉండాలి? తదితర విషయాలపై సీఎం చర్చించారు. ఈ అంశంపై ఒక రౌండ్టేబుల్ సమావేశం, వివిధ ప్రాంతాల్లో ఉత్తమ విద్యావిధానల అధ్యయనం అవసరమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఆ ప్రక్రియలు పూర్తయిన తర్వాత పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని నిర్ణయించారు.
కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా మొదటి సంవత్సరం నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించి, నిర్వహణలోని సాధక బాధకాలను గమనించి మరుసటి ఏడాది నుంచే పాఠశాలలను విస్తరించాలని సీఎం నిర్ణయించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు పది నుంచి పదిహేను ఎకరాల స్థలంలో ఉండాలని, హాస్టల్, స్కూల్, ప్లేగ్రౌండ్, డైనింగ్ హాల్ నిర్మాణాలన్నీ ఆధునికంగా, సౌకర్యవంతంగా నిర్మించాలని అన్నారు.
అటాచ్డ్ టాయిలెట్తో కూడిన గదిలో నలుగురు విద్యార్థుల చొప్పున మాత్రమే ఉండాలని, ఆహారం కూడా పోషక విలువలతో కూడినదై ఉండాలన్నారు. పప్పు, చారుతో సరిపెట్టకుండా గుడ్డు, తాజా, నాణ్యమైన కూరగాయలుండాలని సీఎం చెప్పారు. కలెక్టర్, ఎస్పీల వంటి అధికారుల పిల్లలుకూడా ఈ పాఠశాలల్లో చదవాలన్నారు.
ఉప ముఖ్యమంత్రి డా రాజయ్య, విద్యా శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, కన్సల్టెంట్ ఉపేందర్రెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జగన్నాధ్రెడ్డి, విద్యా శాఖ అడిషనల్ డైరెక్టర్ గోపాల్రెడ్డి, ఓఎస్డీ (విద్య) దేశపతి శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.