News Makers 2019: ఓటమితో మసకబారిన కేసీఆర్ తనయ ప్రతిష్ట .. రాజకీయంగా తగ్గిన కవిత చరిష్మా
గులాబీ బాస్ కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితకు 2019 అసలు కలిసిరాలేదు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్ లో గళం వినిపించి అటు నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లోనూ , ఇటు కేంద్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన కవితకు 2019 చేదు అనుభవాన్ని మిగిల్చింది. కవితకు రాజకీయంగా ప్రాధాన్యత లేకుండా చేసింది. నిజామాబాద్ ఎంపీగా ఆమె ఘోర పరాజయం ఆమె చరిష్మా మసకబారేలా చేసింది. ఈ ఏడాదంతా కవిత దాదాపు సైలెంట్ గానే ఉన్నట్టు తెలుస్తుంది.
నిజామాబాద్ లో కవితకు షాక్ ... ఎంపీగా ఓటమి
ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి బరిలోకి దిగిన కవితకు ఓటర్లు షాక్ ఇచ్చారు. కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను ఓటమి పాలు చేశారు. ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. నిజామాబాద్ ఎన్నికల్లో రైతులు పెద్ద సంఖ్యలో బరిలోకి దిగటం, కవిత తీరుపై పసుపు, ఎర్రజొన్న రైతుల్లో తీవ్ర అసహనం ఉండటం వంటి కారణాలు కవిత పరాజయానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.
కవిత పరాజయానికి కారణం నిజామాబాద్ పసుపు, ఎర్రజొన్న రైతులు
నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల్లో పసుపు రైతులు 176 మంది పోటీలో నిలవడంతో రాష్ట్రంలోనే కాదు.. దేశమంతటా అది హాట్ టాపిక్ అయింది. కవిత ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కేసీఆర్ కు ఊహించని షాక్ గా మారింది. ఓటమి తర్వాత కూడా నియోజకవర్గ అభివృద్ధికి పని చేస్తానని నిజామాబాద్ వదిలి వెళ్లనని చెప్పిన కవిత ఆ తర్వాత రాజకీయాల్లో సైలెంట్ అయ్యారు.
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని కవిత
ఎక్కడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో కూడా ఆమె భాగస్వామ్యం తీసుకోలేదు. ఇక ఆతర్వాత ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిని చేస్తారని, హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి బరిలోకి దించి ఆమె ఎమ్మెల్యే అయితే మంత్రిగా చేస్తారని పలు రకాలుగా ప్రచారం జరిగినా సీఎం కేసీఆర్ కవితకు అవకాశం ఇవ్వలేదు . అప్పటి నుండి ఇప్పటి వరకు అలాంటి నిర్ణయాలు ఏవీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత విషయంలో తీసుకోలేదు. ఇక దీనిపై కవిత కూడా ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు.
గత ఎన్నికల్లో ఓడిన వినోద్ కు పదవి ... డైలమాలో కవిత పరిస్థితి
గత ఎన్నికల్లో ఓటమి పాలైన కవిత తీవ్ర నిరాశలో ఉన్నారు. పార్టీ వ్యవహారాలను కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తెగ హడావిడి చేసిన కవిత ఇప్పుడు ఇంత నైరాశ్యంలో ఉన్నా సీఎం కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారో తెలీటం లేదు. ఇక కవిత ఆలోచన ఎలా ఉందో ఎవరికీ అంతు పట్టటం లేదు . గతంలో కవితతో పాటు పార్లమెంట్ లో చక్రం తిప్పిన ఎంపీ వినోద్ కుమార్ కు ప్రణాళిక సంఘం చైర్మన్ గా అవకాశం కల్పించి క్యాబినెట్ హోదా ఇచ్చిన కెసిఆర్ కవిత విషయంలో ఇప్పటికీ మౌనం వీడటం లేదు .
రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం ఇస్తారని ప్రచారం
కేటీఆర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టటంతో కవితను వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ పదవి కూడా కవితకు దక్కలేదు. సీఎం కేసీఆర్ కేటీఆర్ కే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పట్టం కట్టారు. చిన్నచిన్న నామినేటెడ్ పదవులు చేయడానికి మాజీ ఎంపీ కవిత సిద్ధంగా లేరని తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా కవితకు రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం ఇచ్చి ఢిల్లీ రాజకీయాల్లోకి పంపాలని భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. కానీ ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.
2019 లో జాగృతి కార్యక్రమాల్లో కూడా వెనుకబడిన కవిత
గత ఎన్నికలకు ముందు వరకు లోక్ సభ సభ్యురాలిగా ఢిల్లీలో చక్రం తిప్పిన కవితను రాజ్య సభ సభ్యురాలిగా పంపిస్తారా లేదా అన్నది రానున్న సంవత్సరంలో తేలనుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కవిత రాజకీయంగా చాలా వెనుకంజలో ఉన్నారు. ఇక తెలంగాణా జాగృతి కార్యక్రమాలలో కూడా కవిత పెద్దగా పాల్గొనలేదు. బతుకమ్మ సంబరాల్లో కూడా కవిత ఈసారి కీలక భూమిక పోషించలేదు. మొత్తానికి ఈ ఏడాది కవితకు కలిసి రాలేదు. రాజకీయంగా అష్ట కష్టాలు పడిన కవితకు 2019 ఒక చేదు అనుభవంగానే మిగిలింది.