కేసీఆర్ది సన్నాసి ప్రభుత్వం, అప్పుల్ని కూడా ఆదాయంగా: ఏకేసిన శ్రవణ్
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారశైలి పైన పటారం లోన లొటారం అనే విధంగా ఉందని కాగ్ రిపోర్టుతో తేటతెల్లం అయిందని కాంగ్రెస్ ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. లెక్కకు మించి అప్పులు చేస్తూ, అప్పులను కూడా ఆదాయం చూపిస్తోన్న ఏకైక సన్నాసి ప్రభుత్వం కేసీఆర్దేనంటూ ఆయన మండిపడ్డారు.
భారతదేశ చరిత్రలో కాని, 60 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాని అప్పులను ఆదాయంగా చూపించిన పరిస్థితి లేదని శ్రవణ్ చెప్పారు. అప్పులను ఆదాయంగా చూపించి, తప్పుడు లెక్కలు చూపించి, ప్రజలను మోసం చేస్తూ... దేశంలో తమదే మిగులు రాష్ట్రంగా చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెబుతున్నదే ఇప్పుడు కాగ్ రిపోర్టులోనూ వెలుగు చూసిందని అన్నారు. పరిపాలనలోని డొల్లతనాన్ని, తప్పడు లెక్కలను కాగ్ బయటపెట్టిందని తెలిపారు. దేశంలోనే ధనిక రాష్ట్రమంటూ కేసీఆర్ చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమే అనే విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు.
ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఇదా మీరు సాగిస్తోన్న పరిపాలన? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అధికారంలో కొనసాగే అర్హత కేసీఆర్ సర్కార్కు లేదంటూ శ్రవణ్ మండిపడ్డారు.
నియంత ముఖ్యమంత్రి, రబ్బర్ స్టాంపుల్లాంటి మంత్రులు, బానిసల్లాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, డూడూ బసవన్నలకంటే హీనమైన ఐఏఎస్ అధికారులు అందరూ కలసి నాలుగేళ్ల కాలంలో తెలంగాణను సర్వనాశనం చేశారని శ్రవణ్ మండిపడ్డారు.