కేసీఆర్ వి అన్నీ హత్యా రాజకీయాలే..! నిలువరించి తీరుతామన్న బండి సంజయ్..!!
కరీంనగర్/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై కరీంనగర్ బీజేపి ఎంపీ బండి సంజయ్ విరిచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, కేరళ సీఎం పినరాయి విజయన్ మరియు సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాదిరి చంద్రశేఖర్ రావు హత్యా రాజకీయాలు చేస్తున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపి ఎదుగుతున్న క్రమంలో భయభ్రాంతులకు గురై చంద్రశేఖర్ రావు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. నారాయణపేట జిల్లా దేవరకద్ర గ్రామంలో బీజేపి కార్యకర్త ముష్టి ప్రేమ్ కుమార్ హత్యలో టీఆర్ఎస్ అగ్రనాయకుల ప్రమేయముందని ఆరోపించారు. బీజేపి కార్యకర్త ప్రేమ్ కుమార్ తో పాటు మరో ముగ్గురు కలిపి సామూహికంగా హత్య చేసేందుకు టిఆర్ఎస్ నాయకత్వం కుట్రపన్నిందని ఘాటుగా విమర్శించారు.
మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ పినరాయి విజయన్ ల మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ నాయకత్వం రాజకీయాలకు తెరలేపిందని బండి సంజయ్ వివరించారు. రానున్న రోజుల్లో దాడులు, హత్యా రాజకీయాలు మితి మీరు పోయే ప్రమాదం ఉందని వాటిని ధీటుగా ఎదుర్కునేందుకు బీజేపి నాయకత్వం సిద్ధంగా ఉందని హెచ్చరించారు దేవరకద్ర లో జరిగిన బీజేపి కార్యకర్త ప్రేమ్ కుమార్ హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపి హంతకులను కుట్రకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
దాడులు హత్య రాజకీయాలకు పాల్పడితే మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ కు పట్టిన గతే చంద్రశేఖర్ రావుకు పడుతుందని బండి సంజయ్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపి కార్యకర్తలు, నాయకులు మనోధైర్యంతో ప్రజా క్షేత్రంలో ముందుకు సాగి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ఎంపీ బండి సంజయ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.