టీఆర్ఎస్ నేతల ఆరోపణలు నిజం చేస్తున్న కూటమి, అమరావతిలో బాబుతో కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్/అమరావతి: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల రమ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లిలోని ఏపీసచివాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె టిక్కెట్ కోసం ఆయనతో చర్చించి ఉంటారని భావిస్తున్నారు.
'ఓటుకు నోటు మూసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు, జైలుకెళ్లడం ఖాయం'
టీడీపీ, కాంగ్రెస్ మరో రెండు పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. కూటమిలో కాంగ్రెస్ పార్టీయే అతిపెద్ద పార్టీ. 119 స్థానాలకు గాను 90కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. టీడీపీ 14, తెలంగాణ జన సమితి దాదాపు పది, సీపీఐ 4 సీట్లలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. సీట్ల బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పైనే ఉంది.
చంద్రబాబు వద్దకు కాంగ్రెస్ నేతలు
సీట్ల బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పైనే ఉన్నప్పటికీ సీట్లు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చంద్రబాబు కూడా దృష్టి సారించారు. వ్యక్తిగతంగా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకుంటున్న పలువురు కాంగ్రెస్ నేతలు... చంద్రబాబును కలుస్తుండటం గమనార్హం. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడు కూడా పలువురు నేతలు ఆయనను కలిసి సీట్ల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. చంద్రబాబు ద్వారా వెళ్తే పని అవుతుందని భావిస్తున్నారు. అందుకే పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనను కలుస్తున్నారు.
చంద్రబాబును కలిసిన బండ్ల గణేష్
చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన సమయంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి తదితరులు ఆయనను టిక్కెట్ల అంశంపై కలిశారు. రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కూడా ఢిల్లీలో ఆయనను టిక్కెట్ కోసం కలిశారు. ఇప్పుడు రమ్య కలిశారు. సీక్రెట్గా కలుస్తున్న కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. సీట్ల వ్యవహారం కాంగ్రెస్ చేతిలో ఉన్నప్పటికీ.. చంద్రబాబు చక్రం తిప్పుతున్నారనే వాదనలు ఉన్నాయి.
అలా తెరాస నేతల వ్యాఖ్యలు నిజం చేస్తున్నారు
ఓ విధంగా కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తున్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే ఆ జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటుందని, అప్పుడు మళ్లీ తెలంగాణలో దోపిడీతో పాటు, మనకు రావాల్సి నీళ్లు కూడా కాంగ్రెస్ అండతో చంద్రబాబు తీసుకు వెళ్తారని, వారి జుత్తు చంద్రబాబు చేతిలోనే ఉంటుందని, ఆయన ఆడించినట్లుగా ఆడుతారని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. తెరాస నేతలు అధికారం వచ్చాక ఆ జుత్తు చంద్రబాబు చేతిలో ఉంటుందని చెబుతుండగా, కాంగ్రెస్ నేతలు అంతకంటే ముందే వారి మాటలు నిజం చేస్తూ.. టిక్కెట్ల కోసం ఆయన ముందు సాగిలపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబుపై రమ్య ప్రశంసలు
ఇదిలా ఉండగా, ఇటీవల రమ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. తనకు స్ఫూర్తి చంద్రబాబు అని చెప్పారు. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అని, మంచి స్ట్రాటజీ కలిగిన వ్యక్తి అని, మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడు అని, ఆయన తన కోసం కాకుండా విజన్తో కలిసి పని చేస్తారని, ఇప్పుడు తనకు నష్టం జరిగినా పర్వాలేదు.. భవిష్యత్తులో ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటారని, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని చెప్పారు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిగా చంద్రబాబును తాను గౌరవిస్తానని, అభిమానమని రమ్య చెప్పారు. చంద్రబాబు కూడా తనను పార్టీలోకి ఆహ్వానించారని, కానీ అప్పుడు ఉద్యమం జరుగుతున్న సమయమని చెప్పారు.
అందుకే చంద్రబాబుతో పని చేయలేదని ఇటీవలి ఇంటర్వ్యూలో
కేసీఆర్ అన్న కూతురుగా తాను చంద్రబాబు వద్ద పని చేస్తే ప్రజల్లోకి తప్పుడు సందేశాలు వెళ్తాయని ఊరుకున్నానని, కానీ ఓ మంచి నాయకుడి కింద పని చేసే అవకాశం కోల్పోయాననే బాధ ఎప్పటికీ ఉంటుందన్నారు. చంద్రబాబు చాలా సిన్సియర్గా ప్రజల కోసం పని చేస్తారని రమ్య చెప్పారు. తన పార్టీ అధికారంలో ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదని, కానీ ఆయన ప్రజల కోసం పని చేయాలనుకుంటారని, తాను అతనిని కొన్నిసార్లు కలిశానని చెప్పారు. ఆయన అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తి అన్నారు. పార్టీలు వేరైనా ఆయన రాజకీయంగా ఆయన వ్యక్తిత్వం గొప్పదన్నారు. విభజన అనంతరం చంద్రబాబు మనోధైర్యంతో మాట్లాడారని, తెలంగాణ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని, అదే సమయంలో ఏపీకి న్యాయం చేయాలని మనోధైర్యంతో చెప్పారన్నారు.