ప్రతిపక్షాల వ్యూహాలకు కేసీఆర్ ప్రతివ్యూహం..! అందుకే ఆ 12 సీట్లు పెండింగ్..!!
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు రంజుగా కొససాగుతున్నాయి. ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ అదికార ప్రతిపక్ష నేతలు ముందస్తు ఎన్నికల్లో దూసుకెళ్తున్నారు. మహాకూటమిలో నేతల మద్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో అభ్యర్థులను ప్రకటించడం లేదనే విమర్శలు వస్తుంటే., అభ్యర్థుల ప్రకటనల తాత్సారం వెనక రాజకీయ వ్యూహం ఉందని కూటమి నేతలు చెప్పుకొస్తున్నారు. కూటమి నేతల వ్యవహారం అదికార పార్టీ నేతలకు అగ్ని పరీక్షగా తయారయ్యింది. అదికార గులాబీ పార్టీలో పెండింగ్ లో ఉన్న 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడానికి శరాఘాతంలా పరిణమించింది కూటమి నేతల వ్యవహారం. దీంతో బీఫారాలు ఇచ్చే రోజున కూడా ఆ 12 సీట్ల అభ్యర్థులను మళ్లీ పక్కన పెట్టి మిగతా అభ్యర్థులకు బీ ఫారాలు అందించారు ఆపథర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.
కూటమి వ్యూహాలకు అదికార పార్టీ ప్రతివ్యూహాలు..! నేడో రేపో ఆ 12మంది అభ్యర్థులను ప్రకటించనున్నకేసీఆర్..!
ముందస్తు ఎన్నికలను గడువు దగ్గరకు వస్తున్నందున పార్టీలన్నీ వేగం పెంచేస్తున్నాయి. ఒక్క మహాకూటమి మినహా రాష్ట్రంలోని పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించడం, ప్రచారం నిర్వహించడం చేస్తున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితే అన్ని పార్టీలకంటే ముందుందని చెప్పాలి. ప్రతిపక్షాలు ఇంకా సీట్లపై సిగపట్లు పడుతున్న వేళ, అధికార పార్టీ వేగంగా దూసుకుపోతోంది. అసెంబ్లీని రద్దు చేసిన రోజు 105 మంది అభ్యర్థులను ప్రకటించడంతో ఆయా నేతలంతా ప్రచారాన్ని ముమ్మరం చేసేశారు. కొద్దిరోజుల క్రితం కేసీఆర్, మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.
అసమ్మతి చల్లారాకే అనౌన్స్ మెంట్..! రంగంలో దిగిన కేసీఆర్..!!
అనూహ్యంగా అదికార పార్టీ మరో 12 స్థానాలను పెండింగ్లో పెట్టారు. ఈ జాబితాను ఎప్పుడు వెల్లడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఆదివారం గులాబీ బాస్ 107 మందితో సహా మిగిలిన 12 మంది అభ్యర్థులకు కూడా ప్రకటించి, అందరికీ కలిసి బీఫామ్స్ పంపిణీ చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా 107 మందికే బీఫామ్స్ అందించి, 12 స్థానాలను అలాగే సస్పెన్స్లో ఉంచారు. కేసీఆర్ తొలి జాబితా ప్రకటించినప్పటి నుంచి టీఆర్ఎస్లో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. మంత్రులు, ఇతర నేతలు మంతనాలు జరిపినప్పటికీ ఇంకా అసమ్మతి చల్లారలేదు.
తిరుగుబాటు వద్దు..! గెలిచిన తర్వాత చూస్తానంటున్న ముఖ్యమంత్రి..!!
స్వయంగా కేసీఆరే కొంత మందితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో మాత్రమే కాదు, పెండింగ్లో ఉంచిన చోట్ల కూడా ఇదే తరహా పరిస్థితి ఉంది. అందుకే అభ్యర్థుల ప్రకటన ఆలస్యం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, మహాకూటమి అభ్యర్థులను ప్రకటన కోసమే వేచి చూస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ, అభ్యర్థుల ప్రకటన ఎంత ఆలస్యమైతే అంత నష్టమనే చర్చ మాత్రం జరుగుతోంది.
కూటమి అభ్యర్థుల తర్వాతే టీఆర్ ఎస్ అభ్యర్థుల ప్రకటన..! తేల్చి చెప్పిన కేసీఆర్..!!
ఇదిలాఉండగా, మిగిలిన 12 స్థానాల్లో అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశారని తెలుస్తోంది. ఖైరతాబాద్- దానం నాగేందర్, గోషామహల్- ప్రేమ్సింగ్ రాథోడ్, ముషీరాబాద్- ముఠా గోపాల్, అంబర్పేట- కాలేరు వెంకటేశ్, మేడ్చల్- ఎంపీ మల్లారెడ్డి, మల్కాజ్గిరి- మైనంపల్లి హన్మంతరావు, చొప్పదండి- సుంకె రవిశంకర్, వరంగల్ తూర్పు- నన్నపునేని నరేందర్, హుజూర్నగర్- శానంపూడి సైదిరెడ్డి, కోదాడ- వేనేపల్లి చందర్రావు, వికారాబాద్- టి.విజయ్కుమార్ చార్మినార్- దీపాంకర్పాల్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అయితే, వీరిని ప్రకటించకపోవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా..? లేక ఏదైనా సమస్య ఉందా..? అనేది ఆసక్తికరంగా మారింది. మమాకూటమి అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చంద్రశేఖర్ రావు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.