కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు .. మోడీ, రాహుల్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేనా ?
Recommended Video
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ప్రయత్నం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ కోసం అడుగులు వేస్తున్నారు. దేశంలో మోడీ, రాహుల్ గాంధీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఉండాలని భావిస్తున్న కేసీఆర్ నిదానంగా పావులు కదుపుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ దిశగా మళ్లీ చర్చలు మొదలు పెట్టిన తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం కేరళలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్తో భేటీ అయ్యారు. చెన్నై వెళ్లి స్టాలిన్ ను కలవాలని, ఆ తర్వాత కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ కావాలని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి రావాలని కేరళ సీఎం తో కేసీఆర్ చర్చలు .. సానుకూల స్పందన
కేరళ పర్యటనలో భాగంగా తిరువనంతపురం వెళ్లిన కేసీఆర్.. అక్కడ అనంత పద్మనాభస్వామిని దర్శించుకొని, కేరళ సీఎం పినరయి విజయన్తో సమావేశమయ్యారు. మోడీ, రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ తో కలిసిరండి అంటూ.. వామపక్షాలకు పిలుపునిచ్చిన ఆయన ఫెడరల్ ఫ్రంట్లో చేరాలని కోరారు.కేరళ సీఎం పినరయి విజయన్ తో దాదాపు గంటన్నర సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రతిపాదనలు ఆచరణీయమని విజయన్ అన్నారు. దీనిపై పార్టీలో చర్చిస్తామని ఆయన చెప్పారు . అయితే, ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ మరో ముందడుగు వేస్తున్నారని తాజా పరిణామాల ద్వారా అర్ధం అవుతుంది.
ఈ నెల 13న చెన్నై , 15, 16 తేదీల్లో బెంగుళూరు వెళ్లనున్న సీఎం .. ఫెడరల్ ఫ్రంట్ కోసమే
ఇక ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో భాగంగా ఈ నెల 13న తెలంగాణా సీఎం కేసీఆర్ చెన్నై వెళ్లనున్నారు. అక్కడ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ను ఆయన ఇంట్లో కలవనున్నారు.దేశంలోని తాజా పరిణామాలపై చర్చించనున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతపై ఆయనతో చర్చించనున్నారు. గతంలోనూ స్టాలిన్ తో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించారు. కరుణానిధి మరణంతో ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇప్పుడు మళ్ళీ స్టాలిన్ ను కలవనున్న నేపధ్యంలో దేశ వ్యాప్త ఆసక్తి నెలకొంది . అలాగే సోమవారం కేరళకు బయలుదేరే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. 15, 16 తేదీల్లో బెంగళూరుకు రావాలని కేసీఆర్ను కుమారస్వామి ఆహ్వానించారు. ఇక ఈ నేపధ్యంలో కేసీఆర్ పర్యటన దేశ వ్యాప్త చర్చకు కారణం అవుతుంది.
మోడీ, రాహుల్ గాంధీలకు ప్రత్యామ్నయంగా ఎదగాలని అడుగులు వేస్తున్న కేసీఆర్
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక అన్ని దశలు ఈనెల 19న ముగియనున్నాయి. 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి సొంతంగా మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం లేదని, మూడో ఫ్రంట్ లేదా బీజేపీయేతర పక్షాల కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారంతో ప్రధానిగా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. చంద్రబాబు బీజేపీయేతర కూటమి ద్వారా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తుంటే , చంద్రబాబుకు చెక్ పెడుతూ, మోడీ , రాహుల్ గాంధీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్నారు.