కేసీఆర్ కొత్త ప్లాన్, కాంగ్రెస్కు 'డబుల్' షాక్!: టచ్లో 12 మంది ఎమ్మెల్యేలు, అదీ పోయి.. ఇదీ పోయేనా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు 'డబుల్ వ్యూహం'తో ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా తమ వైపు లాక్కోవడంతో పాటు, అది లోకసభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచేందుకు ఉపయోగపడుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19, టీడీపీ నుంచి ఇద్దరు మాత్రమే గెలిచారు. స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే తెరాస వైపు వెళ్లారు. బీజేపీ నుంచి రాజాసింగ్ లోథ్ విజయం సాధించారు. టీడీపీ నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వర రావు, సండ్ర వెంకట వీరయ్యలు ఖమ్మం జిల్లాకు చెందినవారు. ఇప్పటికే వీరిపై పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. వారు దీనిని కొట్టి పారేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారి వైపు కూడా కేసీఆర్ చూస్తున్నారట.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగయిందని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పైన కేసీఆర్ దృష్టి సారించారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలుఅన్న చందంగా... కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలను తెరాసలోకి ఆకర్షించడం ద్వారా డబుల్ లబ్ధి పొందాలని లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరితో కాంగ్రెస్ ముక్త్ తెలంగాణతో పాటు, 2019 లోకసభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను ఒకటి మజ్లిస్కు పోను, మిగతా 16 స్థానాల్లో సులభంగా గెలుపొందవచ్చునని భావిస్తున్నారట.
8 మంది చేరితో ప్రతిపక్ష హోదా దక్కదు
119 నియోజకవర్గాలు గల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉండాలంటే కనీసం 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 స్థానాల్లో గెలిచారు. ఇందులోని కనీసం ఎనిమిది మందిని ఆకర్షిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కదు. స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో దశాబ్దాల పాటు సమైక్య ఏపీని పాలించిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని తెరాస ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.
తెరాసతో టచ్లో 12 మంది ఎమ్మెల్యేలు
ఇందుకోసం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటికే తెరాస ముఖ్యనేతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దాదాపు డజను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారితో టచ్లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇందులో వాస్తవం ఎందో, అవాస్తవం ఎంత అయినప్పటికీ.. ఇటీవల ఎమ్మెల్సీలు మండలిలో తెరాసలో విలీనం చేస్తున్నట్లుగా లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు తెరాసతో టచ్లో ఉన్నారని తెలుస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి శాసన సభలో విపక్ష హోదా కూడా దక్కదు.
కాంగ్రెస్కు చెక్ పెట్టే ప్రయత్నాలు
తెలంగాణలో మొత్తం 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 1 మజ్లిస్ పార్టీది అని కేసీఆర్, తెరాస మొదటి నుంచి చెబుతున్నారు. మిగతా 16 స్థానాలపై కేసీఆర్ దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాకపోయినా.. లోకసభ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఎమ్మెల్యేలను ఆకర్షించి.. లోకసభ స్థానాలు కాంగ్రెస్ గెలవకుండా ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆ లోకసభ స్థానాల పరిధిలో ఒక్క ఎమ్మెల్యేను గెలవలేదు
కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. పలువురు ఎమ్మెల్యేలు తెరాసతో టచ్లో ఉండటం ప్రచారం పక్కన పెడితే... 16 లోకసభ స్థానాలకు గాను 5 లోకసభ స్థానాల పరిధిలోని ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్, సికింద్రాబాద్ లోకసభ పరిధిలో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యేను గెలుచుకోలేదు.
కేసీఆర్ మరో ప్లాన్
మరో ఎనిమిది లోకసభ నియోజకవర్గాల పరిధిలో కేవలం ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. అదిలాబాద్, మల్కాజిగిరి, మెదక్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, వరంగల్, జహీరాబాద్, నల్గొండ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే గెలిచింది. ఖమ్మం, మహబూబాబాద్ లోకసభ స్థానాల పరిధిలో మాత్రమే మూడు చొప్పున ఎమ్మెల్యేలను గెలుచుకుంది. భువనగిరి, చేవెళ్ల పరిధిలో రెండు చొప్పున ఎమ్మెల్యేలను గెలిచింది. ఇందులో కూడా పలువురు తెరాసతో టచ్లో ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలా అన్ని లోకసభ స్థానాల పరిధిలోని ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొని, 2019లో కాంగ్రెస్ను భారీగా దెబ్బతీయాలనేది కేసీఆర్ మరో ప్లాన్గా చెబుతున్నారు.