అడిగితే అవసరం లేదన్నారు, ఏవైపో తేల్చుకో: కేసీఆర్పై బాబు, హైదరాబాద్తో మరో సిటీని పోల్చలేం
న్యూఢిల్లీ: ఇప్పుడు దేశంలో బీజేపీ కూటమి, బీజేపీ వ్యతిరేక కూటమి మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎవరి వైపు ఉంటారో తేల్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Recommended Video
మోడీపై దుమ్మెత్తిపోసి, రాహుల్ గాంధీని ప్రశంసించిన చంద్రబాబు
కాంగ్రెస్ పనిష్మెంట్ అయిపోయింది
తెలంగాణతో కేసీఆర్తో బీజేపీ అంతర్గతంగా పొత్తు పెట్టుకొని టీడీపీ లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ తదితర విభజన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని మోడీని ప్రశ్నించారు. విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీకి పనిష్మెంట్ అయిపోయిందని, ఇప్పుడు హోదా ఇస్తామని చెబుతోందని అన్నారు. బీజేపీ నమ్మకద్రోహం చేసిందని దుయ్యబట్టారు.
కేసీఆర్కు స్నేహహస్తం చాటితే అవసరం లేదని చెప్పారు
కేసీఆర్ ప్రారంభించిన థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల గురించి ఆయననే అడగాలని చంద్రబాబు మీడియాకు సూచించారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ కూటమి, బీజేపీ వ్యతిరేక కూటమి మాత్రమే ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు. తాను టీఆర్ఎస్ పార్టీకి స్నేహహస్తం అందిస్తే అవసరం లేదని తిరస్కరించారని చెప్పారు.
తెలంగాణపై స్థానిక నాయకత్వం చూసుకుంటుంది
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల విషయమై రాహుల్ గాంధీతో చర్చించలేదని చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో సీట్ల అంశాన్ని స్థానిక నాయకత్వం చూసుకుంటుందని చెప్పారు. జాతీయస్థాయి అంశాలపై మాత్రమే చర్చించామన్నారు. తమకు దేశ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ఏపీకి ఏం చేయలేదని, బీజేపీ నమ్మించి మోసం చేసిందన్నారు.
బీజేపీ పేరు వింటేనే ఆత్మక్షోభిస్తోంది
బీజేపీ ఏపీకి అన్యాయం చేయడంతో పాటు ఐటీ దాడులు చేసిందని చంద్రబాబు చెప్పారు. ఐటీ దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పేరు వింటేనే ఏపీ ప్రజల ఆత్మ క్షోభిస్తోందన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై అన్ని జాతీయ పార్టీలు తమకు మద్దతిచ్చాయని చెప్పారు. ఏపీ అంశాలపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయన్నారు. మోడీ సంకీర్ణ ధర్మాన్ని నాశనం చేశారన్నారు. మోడీ కంటే ఏ నాయకుడైనా గొప్పగా పని చేస్తారని చెప్పారు. విభజన సమస్యలు పరిష్కరిస్తారనే ఆశతో నాడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. తమతో చెప్పకుండా తెలంగాణలో బీజేపీ పొత్తు తెగదెంపులు చేసుకుందని చెప్పారు.
హైదరాబాద్ను దేశంలో మరో నగరంతో పోల్చలేం
హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు హైదరాబాదులో తలసరి ఆదాయం బాగా ఉందని, అందుకు తమ పాలనే కారణమని చెప్పారు. హైదరాబాదును, తెలంగాణను తెలుగువారి కోసం అభివృద్ధి చేశానని చెప్పారు. హైదరాబాదుతో దేశంలో మరో నగరాన్ని పోల్చడానికి వీల్లేదని చెప్పారు. మన దేశంలో ఉన్న యువత మరెక్కడా లేదని చెప్పారు. మనవాళ్లకు ఇంగ్లీషులో మంచి ప్రావీణ్యం ఉందన్నారు. సంకీర్ణ ప్రభుత్వాల హయాంలోనే దేశం అభివృద్ధి చెందిందని చెప్పారు. పీవీ నర్సింహారావు, వాజపేయి ప్రభుత్వాలు ఎన్నో సంస్కరణలకు ప్రతీకలు అన్నారు. మోడీకి వచ్చిన సంపూర్ణ ఆధిక్యం దేశాన్ని తిరోగమణంలోకి తీసుకు వెళ్లిందన్నారు.