వద్దు.. ఆ సమావేశానికి వెళ్లొద్దు: ఈటెలకు కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల నుంచే కేంద్రానికి పెద్ద మొత్తంలో ఆదాయం వెళ్తున్నా.. కేటాయింపుల విషయంలో మాత్రం వివక్ష కొనసాగుతుందన్న వాదన బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా.. ఈ విషయంలో కేంద్రం తీరును చాలాసార్లు తప్పుపట్టారు.
కేంద్రం నిర్ణయంతో దక్షిణాదికి పూడ్చలేని నష్టం?: ఒక్కో రాష్ట్రానికి రూ.20వేల కోట్ల దెబ్బ
ఇదే విషయమై చర్చించడానికి కేరళ ప్రభుత్వం మంగళవారం నాడు నిర్వహిస్తున్న 'దక్షిణాది ఆర్థిక మంత్రుల సమావేశం' పట్ల మాత్రం ఆయన భిన్నంగా స్పందించారు. ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాల్సిందిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ను ఆదేశించారు.
దేశ సమగ్రతకు, జాతీయ ప్రయోజనాలకు ఇలాంటి కార్యక్రమాలు అంత మంచివి కాదని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. కాగా, 1971కి బదులు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు జరపాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫారసులను వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం నిర్వహిస్తోంది.
కేసీఆర్ ఆదేశాలను మంత్రి ఈటెల రాజేందర్ కూడా ధ్రువీకరించారు. కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని చెప్పారు. అయితే కారణాలను మాత్రం ఆయన వివరించలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం ఆ సమావేశానికి హాజరవుతుండటం గమనార్హం.
ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. 'ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దక్షిణాది-ఉత్తరాది విభజన గురించి, కేంద్రం చూపిస్తున్న వివక్ష గురించి మాట్లాడుతున్నాయి. నేను అలాంటి వాటిని ప్రోత్సహించదలుచుకోలేదు.
జాతీయ సమైక్యతకు, జాతీయ ప్రయోజనాలకు ఇది ఎంతమాత్రం మంచిది కాదు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా కేంద్రం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి' అని ఆ సందర్భంగా ఆయన వెల్లడించారు.