ఇక నుండి నిలదీతల పర్వమే .. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే .. బండి సంజయ్ ధ్వజం
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ,తెలంగాణ సీఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నవన్నీ అబద్ధాలని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ముసాయిదాను ఆధారం చేసుకుని రాజకీయం చేశారని, ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
జీహెచ్ఎంసీఎన్నికలు టార్గెట్ గా కమలదళం .. బీజేపీ పాదయాత్ర.. రంగంలోకి బండి సంజయ్
కేసీఆర్ .. అవగాహన లేకుంటే జగన్ ను మరోమారు భోజనానికి పిలిచి తెలుసుకో
కేసీఆర్ సీఎం హోదాలో ఉండి ఈ తరహా రాజకీయాలు చేయడం, అబద్ధాలు మాట్లాడడం సిగ్గుచేటని బండి సంజయ్ మండిపడ్డారు. కొత్త విద్యుత్ సవరణ చట్టంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేని ఇబ్బంది కేసీఆర్ కి ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నించారు బండి సంజయ్. ఇక దీనిపై అవగాహన లేకపోతే మరోమారు సీఎం జగన్మోహన్ రెడ్డిని భోజనానికి పిలిచి ఆయన ద్వారా తెలుసుకోవాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టక ముందే దాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఎలా చేస్తారో చెప్పాలని ఆయన కేసీఆర్ ను నిలదీశారు.
కొత్త విద్యుత్ సవరణ చట్టం కేసీఆర్ వ్యతిరేకించేది ఇందుకే
అంతేకాదు కొత్త విద్యుత్ సవరణ చట్టంతో ఉద్యోగాలు పోతాయో చెప్పాలని కూడా ప్రశ్నించారు బండి సంజయ్. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని, సామాన్య రైతులకు లబ్ది చేకూరటం లేదని, రైతుల పేరుతో జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయడం కోసమే కొత్త విద్యుత్ సవరణ చట్టం అని పేర్కొన్నారు బండి సంజయ్. ఎక్కడ టిఆర్ఎస్ పార్టీ తమ దోపిడీకి అడ్డంకిగా మారుతుందో అని కొత్త విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటూ ఆయన ఆరోపించారు.
Recommended Video
ఇక నుండి ప్రజా క్షేత్రంలో నిలదీస్తామన్న బండి సంజయ్
టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన హామీలను గాలికి వదిలేసిందని నిప్పులు చెరిగారు బండి సంజయ్. ఇక నుండి ప్రజాక్షేత్రంలో టిఆర్ఎస్ పార్టీని నిలదీసే కార్యక్రమం చేపడతామని ఆయన తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రతి హామీ విషయంలో కేంద్ర సహకారం లేదంటూ ఆరోపిస్తున్నారని గులాబీ బాస్ కేసీఆర్ పై బీజేపీ తెలంగాణా చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. పాతబస్తీలో జరుగుతున్న విద్యుత్ చౌర్యం పై, లక్షల రూపాయలలో ఉన్న విద్యుత్ బకాయిలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు.