ఎటమటం చేశారో కందిళ్లు కొనుక్కోవాలి, వారికి తెలివిలేదు: కేసీఆర్, చంద్రబాబుపై సెటైర్లు
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సోమవారం కామారెడ్డి, నిజామాబాద్లలో జరిగిన ప్రచార బహిరంగ సభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
హైదరాబాదును తాను నిర్మించానని చంద్రబాబు చెప్పారని, అలా అయితే కులీకుతుబ్ షా ఎక్కడకు పోవాలని కేసీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. జెండాలను, పార్టీలను చూసి ఆగం కావొద్దని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పరిణితి రావాల్సి ఉందని చెప్పారు. తిరగబడి తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో కరెంట్ కష్టాలు ఉండేవన్నారు.
తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?
సమస్యలు పరిష్కారం కాలేదు
కాంగ్రెస్, టీడీపీ పాలకుల కారణంగా బీడీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని కేసీఆర్ చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో పెద్దపెద్ద నేతలు ఉన్నా ఒక్కరు కూడా కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని చెప్పారు. దేశ చరిత్రలో తొలిసారి బీడీ కార్మికులకు రాష్ట్రంలో నెలకు రూ.1000 పింఛన్ ఇస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరో రూ.వెయ్యి పెంచుతామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అమ్మాయిలు పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు ఇస్తామన్నారు.
కార్యకర్తల నాయుడు
తమ ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలు, పనులు చేపడుతుంటే విపక్షాలకు ఓటేయాల్సిన అవసరం ఏముందని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో విపక్ష నేతలు ఊరికి ఓ లారీ చొప్పున చీప్ లిక్కర్ మద్యాన్ని దించుతున్నారని ఆరోపించారు. ఏపీకి చెందిన కార్యకర్తల నాయుడు ప్యాకేజీలు పెట్టి ఎమ్మెల్యే అభ్యర్థులను కొనుగోలు చేస్తున్నాడని చంద్రబాబును ఉద్దేశించి మండిపడ్డారు.
కందిళ్లు, ఇన్వర్టర్లు కొనుక్కోవాలి, వారికి తెలివిలేదు
కామారెడ్డి నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి గంగా గోవర్ధన్కు మద్దతుగా జరిగిన ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. విపక్ష నేతలకు తెలివి లేదని చెప్పారు. ఎటమటం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారో.. మళ్లీ కందిళ్లు (కందిళ్ల అంటే.. పాత కాలంలో కరెంట్ లేని సమయంలో ఇంట్లో దీపాలు ఇలాగే వెలిగించేవారు, కిరోసిన్ పోసి వెలిగించేవారు) కొనుక్కోవాలని, ఇన్వర్టర్లు కొనుక్కోవాలని చెప్పారు.
పోచారం చొరవతో
తమ ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు బీమా పథకం నిజంగానే రైతన్నల పాలిట ధీమాగా మారిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతోనే ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. బాన్సువాడకు చెందిన శ్రీనివాస రెడ్డికి రైతన్నల సమస్యలపై లోతైన అవగాహన ఉందన్నారు. ప్రమాదాల్లో, సహజ కారణాలతో రైతన్నలు చనిపోతే వారి కుటుంబాలకు బీమా కింద రూ.5 లక్షలు ఇస్తున్నామన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి అద్భుత పథకాలకు తన హయాంలో అంకురార్పణ చేసిన పోచారంను తాను లక్ష్మీ పుత్రుడని పిలుస్తానని చెప్పారు. నిజామాబాద్ రూరల్ అభ్యర్థి గంపా గోవర్ధన్ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.