కేసీఆర్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లినందుకే పొత్తులు..!హుజూర్ నగర్ లో టీడిపి ప్రభావం ఉంటుందన్న కిరణ్మయి..!
హైదరాబాద్ : తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక రసకందాయంలో పడింది. నిన్నటి వరకూ అభ్యర్దుల ఎంపిక, ప్రచార వ్యూహాలతో బిజీగా ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పుడు పరస్పరం విమర్శలకు దిగుతున్నాయి. అధికార గులాబీ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మీద టీఆర్ఎస్, ఈ రెండు పార్టీల మీద బీజేపి ఆరోపణలు గుప్పిస్తోంది. తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా రంగ ప్రవేశం చేసింది.
గులాబీ బాస్ యోచన .... హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి ఏపీ వైసీపీ నేతలు ?
ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, హుజూర్ నగర్ ఉపఎన్నికలో తప్పక ప్రభావం చూపుతుందని ఆ పార్టీ అభ్యర్ధి చావా కిరణ్మయి ధీమా వ్యక్తం చేస్తోంది. టీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఆత్మవిశ్వాసం సన్నగిల్లినందుకే ఇతర పార్టీలతో పొత్తులకు వెంపర్లాడుతున్నారని కిరణ్మయి ఘాటుగా విమర్శించారు.
హుజూర్ నగర్ లో సత్తా చాటుతాం.. ప్రజల్లో మార్పు వచ్చిందంటున్న టీడిపి అభ్యర్ది కిరణ్మయి..
పార్టీలో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు ఉంటుందని, అందుకు తనే ఉదాహరణ అని హుజూర్ నగర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి చావా కిరణ్మయి స్పష్టం చేసారు. 1998నుండి తాను పార్టీకి సేవలందిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తెలంగాణ పుట్టిన తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికి చెరగని స్దానం ఉంటుందని అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు తనను అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు చంద్రబాబు నాయుడుకు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు యల్ రమణకు కృతజ్ఞతలు తెలిపారు. హుజూర్ నగర్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం అలుపెరగని పోరాటం చేస్తానని కిరణ్మయి వన్ ఇండియాతో ప్రత్యేకంగా పేర్కొన్నారు.
క్షేత్ర స్ధాయిలో టీడిపి బలంగా ఉంది.. టీడిపి ప్రభావం ఉప ఉన్నికలో ఉంటుందన్న అభ్యర్ది..
అంతే కాకుండా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది అని ప్రశ్నించే వారికి ఈ హుజూర్ నగర్ ఉప ఎన్నిక సమాధానం చెప్తుందని కిరణ్మయి తెలిపారు. స్వార్ధ రాజకీయాల కోసం నాయకులు పార్టీ మారినా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అంకిత భావంతో పార్టీ జెండాను ఇంకా తమ బుజాల పైన మోస్తున్నారని, క్షేత్రస్ధాయిలో పరిశీలిస్తే ఈ అంశం స్పష్టమవుతుందని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉందని, హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం కూడా టీడిపి కి అనుకూలంగా వస్తుందని కిరణ్మయి ధీమా వ్యక్తం చేసారు.
కేసీఆర్ భ్రమలు కల్పించారు.. ప్రజలు గ్రహించే స్దాయికి చేరుకున్నారంటున్న టీడిపి..
గత ఆరున్నరేళ్లుగా అదికార గులాబీ పార్టీ కాలక్షేపం చేసింది తప్ప, ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కిరణ్మయి విమర్శించారు. కళ్యాణ లక్ష్మీ పథకంలో ఎన్నో అవతవకలు చోటుచేసుకుంటున్నాయని, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయో అంతుచిక్కకుండా ఉందని, వెనుకబడిన వర్గాలకు మూడెకరాల భూమి ఎంతమందికి ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు భ్రమలు కలిగిస్తున్నారదని, ప్రజలు ఇప్పుడిప్పుడే తిరగబడేందుకు సిద్దమవుతున్నారని అన్నారు. అమర వీరుల త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు తీవ్ర నష్టం జరిగిందని కిరణ్మయి ఆవేదన వ్యక్తం చేసారు.
చంద్రాబాబు ప్రచారానికి వచ్చే అంశం పై స్పష్టత రావాలి... వస్తే ఇంకా మంచిదన్న టీడిపి అభ్యర్ధి..
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మంది ఉద్యమకారులు తమ ఆవేదనను వెళ్లగక్కారదని, ఇలాంటి ఉద్యమాలు ముుందు ముందు మరిన్ని వస్తాయని, ఇది ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తుందని చావా కిరణ్మయి తెలిపారు. హుజూర్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అదికార పార్టీ నేతలు అక్రమంగా పరిశ్రమలు నెలకొల్పి వాతావరణ కాలుష్యానికి కారణం అవుతున్నా అడిగే నాథుడు లేడని మండిపడ్డారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి చంద్రబాబు నాయుడు వస్తే మరింత ఊపొస్తుందని అన్నారు.