ఎమ్మెల్సీగా కొండా మురళి: నమ్ముకుంటే చేస్తానని కెసిఆర్ సంకేతాలు?
హైదరాబాద్: తనను నమ్ముకుంటే తగిన స్థానం కల్పిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మరోసారి సంకేతాలు పంపించారు. శాసనసభ్యురాలు కొండా సురేఖ దంపతుల విషయంలో కెసిఆర్ వైఖరి ఆ విషయాన్ని తెలియజేస్తోంది. కొండా మురళీ వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నిజానికి, కొండా సురేఖ కెసిఆర్ మంత్రివర్గంలో చోటు కోరుకున్నారు. అయితే, ఆమెకు ఆ పదవి దక్కలేదు. అయినా ఆమె సహనంతో వేచి చూస్తూ వచ్చారు. తన భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలనేది కూడా ఆమె కోరుకున్న విషయాల్లో ఒక్కటి. కొండా మురళిని శాసనమండలికి ఎన్నికయ్యేలా కెసిఆర్ చూశారు. దీంతో కొండా దంపతులకు చాలా వరకు ఊరట లభించినట్లే.
కెసిఆర్ వైఖరి పట్ల కొండా సురేఖ తీవ్రమైన ఆసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడా సాగింది. అయితే, ఆమె ఎక్కడ కూడా ఏ విధమైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా, అసంతృప్తిని వ్యక్తం చేయకుండా వేచి చూశారు. దాంతో ఆమెకు తగిన ఫలితం దక్కినట్లయింది.
నాయకులందరి పట్ల కెసిఆర్ అదే పద్ధతిని పాటిస్తూ వస్తున్నారు. ఓపికగా ఎదురు చూస్తే ఏదో ఒకటి ఇస్తానని ఆయన చాలాసార్లు చెప్పారు కూడా. గతంలో స్వామి గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటానని చెప్పారు. కానీ, అది కుదరలేదు. దాంతో ఆయనను శాసన మండలి చైర్మన్గా చేశారు. ఆ రకంగా తనపై నమ్మకం ఉండే నేతలకు కెసిఆర్ ఏదో ఒకటి చేస్తారనే విషయాన్ని కెసిఆర్ మరోసారి కొండా సురేఖ దంపతుల ద్వారా సంకేతాలు పంపించారని అంటున్నారు.