అభివృద్ధికి కట్టుబడి వాళ్లను పట్టించుకోలే..!ఇప్పుడు "తిన్నదంతా కక్కిస్తా".. కాంగ్రెస్ నేతలపై కేసీఆర్
హైదరాబాద్ : మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆరోపణాస్త్రాలు పదునెక్కుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది క్యాంపెయిన్. ఈ క్రమంలో నర్సంపేట సర్వాపురం సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. "తిన్నదంతా కక్కిస్తా" అంటూ కాంగ్రెస్ లీడర్లపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బ్రహ్మాండంగా కడుతున్నామని అందుకే ఆలస్యం జరుగుతోందన్న కేసీఆర్.. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ గృహాల్లో వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
మళ్లీ వస్తా.. అవినీతి అంతు తేలుస్తా
ఈసారి అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేల్చుతామన్నారు కేసీఆర్. ఎవరెంత మింగారో తేల్చి.. తిన్నదంతా కక్కిస్తామన్నారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ కావాల్నా? నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ మళ్లీ రావాల్నా? ఎవరి పాలన బాగుందో తేల్చుకుని ఓట్లేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబును తరిమికొట్టి తెలంగాణ తెచ్చుకున్నాం.. అలాంటిది మళ్లీ చంద్రబాబును ఇక్కడకు తీసుకొస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటుతో దెబ్బ కొట్టాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లల్లో 5వేల కోట్ల కుంభకోణం
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లల్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు కేసీఆర్. 5వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో తమది తొలి ప్రభుత్వం కాబట్టి ఈ నాలుగున్నరేళ్లు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. అవినీతిపరుల అంతు తేల్చలేదని చెప్పుకొచ్చారు. మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు ఇలా సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టామే తప్ప ప్రజాధనం కొల్లగొట్టినవారి పనిపట్టే సమయం లేదని అన్నారు. ఈసారి అధికారంలోకి వస్తే అవినీతిపరుల భరతం పడతామన్నారు. ఎవరి లెక్కలేంటో తేల్చి తిన్నదంతా కక్కిస్తామన్నారు.
వాళ్లు మింగారు.. మేము చేస్తామంటే ఆరోపణలు
కాంగ్రెస్, టీడీపీ హయాంలో చేపట్టిన గృహ నిర్మాణాల్లో భారీగా కుంభకోణాలు జరిగాయని మండిపడ్డారు కేసీఆర్. ఇష్టారాజ్యంగా ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఫైరయ్యారు. వారు మింగేదంతా మింగి ఇప్పుడు తమపై వేలెత్తి చూపిస్తున్నారని ఆరోపించారు. ఒకచోట వంద ఇళ్లు అవసరముంటే 140 కట్టారని.. అవన్నీ ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. నాలుగు రోజులు ఆలస్యమైనా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంచిగా కట్టాలన్నదే తమ లక్ష్యమన్నారు కేసీఆర్. ఏది ఏమైనా 2 లక్షల 60వేల ఇళ్లు నిర్మిస్తామన్నారు. అలాగే అధికారంలోకి రాగానే సొంత జాగా ఉన్నోళ్లు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.
టీఆర్ఎస్ పథకాలు భేష్ : కేసీఆర్
దేశంలో మరెక్కడా లేని విధంగా ఒక తెలంగాణలోనే రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందుతోందన్నారు కేసీఆర్. ఏ ప్రభుత్వాలు కూడా సాహసం చేయని రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన 10 ఉత్తమ పథకాల్లో రైతుబంధుకు చోటు దక్కిందని చెప్పారు. కేసీఆర్ బతికున్నంత కాలం నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతు బంధు పథకాలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. రైతుబంధు పథకం కింద ఏడాదికి పెట్టుబడి రాయితీ ఎకరానికి 10వేల రూపాయల చొప్పున పెంచుతామన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంతో పాటు అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న రైతులు ధనవంతులు కావాలన్నదే తన ఆశయమని చెప్పుకొచ్చారు.