కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. హైదరాబాద్ భూములు అమ్మి పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తాం..!
హైదరాబాద్ : పాలమూరు జిల్లాను పాలు గారే జిల్లాగా అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామంటూ భరోసా కల్పించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్లో విలువైన భూములు అమ్మి పాలమూరు ఎత్తిపోతల పథకం ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి పాలకుల దెబ్బతో కరవుతో అల్లాడుతున్న వలసల జిల్లా పాలమూరు దశదిశ మార్చుతానని ప్రకటించారు. గోదావరి - కృష్ణా నదుల అనుసంధానం జరిగితే గొప్ప పరిణామం చూడొచ్చన్న కేసీఆర్.. రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఎన్ని వేల కోట్లైనా వెచ్చిస్తామని స్పష్టం చేశారు. పనిలో పనిగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కే విజయం కట్టబెట్టాలంటూ పొలిటికల్ ప్రచారానికి తెర లేపారు.
పాలమూరు జిల్లా ప్రజలకు అండగా ఉంటానంటూ..!
పాలమూరు జిల్లా ప్రజలకు ఎల్లవేళలా అండదండలు అందిస్తానంటూ భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. ఉమ్మడి ఏపీలో పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన పాలకులను ఆ పాపం వెంటాడుతుందని తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. పాలమూరు ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. ఏడాదిలోగా పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఒక్క షిఫ్ట్లో జరుగుతున్న పనులను మూడు షిఫ్టులకు పెంచి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయండి.. అధికారులకు దిశానిర్దేశం.. పాలమూరు పర్యటనలో సీఎం
ఏపీతో అలా ఒప్పందాలు.. ఆ రెండు నదుల అనుసంధానం..!
శ్రీశైలానికి గోదావరి నీళ్లు తరలించేలా ఏపీతో చర్చలు జరుగుతున్నాయి. ఇక ముందు కూడా అలాంటి ఎన్నో ఒప్పందాలు రెండు రాష్ట్రాల మధ్య జరుగుతాయని ఆకాంక్షించారు. గోదావరి, కృష్ణా నదులను కలపడానికి ఏపీ నుంచి ప్రతిపాదన వచ్చింది. మంచిగా ఆలోచన చేసే దిశగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్వాకాల వల్ల ఉత్తర తెలంగాణ ఎండిపోయింది. ఇప్పుడు ఆ కష్టాల నుంచి బయటపడేందుకు కృషి చేస్తున్నామని వివరించా
రైతాంగానికి నీళ్లు ఇవ్వడానికి కరెంట్ కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం..!
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళుతున్నట్లు చెప్పారు. రైతాంగానికి నీళ్లు ఇవ్వడానికి కరెంట్ కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తామని వెల్లడించారు. కొందరు దద్దమ్మల్లా మాట్లాడుతూ అన్ని కోట్లా ఇన్ని కోట్లా అంటూ ఆరోపణలు చేస్తున్నారని.. ఐదు వేల కోట్లు కాదు అవసరమైతే పదిహేను వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు. ఆరు నూరైనా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రైతులకు నీళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక జిల్లాకు చెందిన కొందరు నేతలు తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారని.. అలాంటోళ్లకు ఏం చెబుతామంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. జూరాల మీద అవాకులు చవాకులు పేల్చడం సరికాదని హితవు పలికారు.
హైదరాబాద్ భూములు అమ్మి పాలమూరు ఎత్తిపోతలకు పెడతాం..!
పాలమూరును సస్యశ్యామలంగా మారుస్తామన్నారు కేసీఆర్. ఏడాదిలోగా పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తామన్నారు. హైదరాబాద్లో విలువైన భూములు అమ్మకానికి పెట్టామని.. ఆ డబ్బులు వచ్చాక పాలమూరు ఎత్తిపోతల పథకానికే వెచ్చిస్తామని ప్రకటించారు. జిల్లాలో బంగారం లాంటి భూములు ఉన్నాయని.. కష్టపడే రైతులున్నారని.. ఆ క్రమంలో పాలమూరును పాలు గారే జిల్లాగా చేద్దామని పిలుపునిచ్చారు.
గోదావరి - కృష్ణా నదుల అనుసంధానం జరిగితే గొప్ప పరిణామం అని వ్యాఖ్యానించారు కేసీఆర్. ఎండాకాలం వస్తే చాలు.. జూరాల ఎండిపోతోంది.. కర్ణాటకను బతిమిలాడి అర టీఎంసీయో, ఒక టీఎంసీయో నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రతిసారి కర్ణాటకను బతిమిలాడుకునే పరిస్థితి పోవాలంటే పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారానే జూరాలకు నీటి సరఫరా ఉండేలా ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు.
మైనర్ బాలికలతో ఆడుకుంటున్న మరో రెడ్డి.. జడ్చర్లలో టెన్త్ క్లాస్ విద్యార్థిని దారుణ హత్య..!
కాళేశ్వరం, భగీరథను అందరూ మెచ్చుకుంటే.. వాళ్లేమో సన్నాసులా?
కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్నో రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవాళ అద్భుతం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అటు మిషన్ భగీరథపై కామెంట్ చేసినోళ్లు కళ్లప్పగించి చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అందరూ మెచ్చుకుంటే కొందరు సన్నాసులేమో పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడటం అయిపోయాక.. పొలిటికల్ యాంగిల్ టచ్ చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా.. పాలమూరు ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గుండెల్లో పెట్టుకుంటున్నారని.. అసెంబ్లీ, పార్లమెంటరీ, జడ్పీ ఎన్నికల్లో పట్టం కట్టారని గుర్తు చేశారు. ఆ క్రమంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఆ విధంగా ప్రభుత్వం కూడా మీకు రుణపడి ఉంటుందన్నట్లుగా మాట్లాడారు. చివరగా కేసీఆర్ చెప్పిండంటే అది జరిగి తీరుతుందని.. జిల్లా అభివృద్ధి విషయంలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.