భయం.. భయం!: 2019 బిగ్ ప్లాన్, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వెనుక అసలు కథ ఇదీ!!
Recommended Video
హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మార్పు తీసుకురావడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయని, కాబట్టి కొత్త ఫ్రంట్ ఆవశ్యకత ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇవి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యం ఏమిటి? నిజంగానే ఆ ఫ్రంట్ సాధ్యమా? గత అనుభవాల దృష్ట్యా ప్రంట్ ఎన్నాళ్లు మనగలుగుతుంది? అందులో ఎవరెవరు ఉంటారు? నిజంగా దక్షిణాదిని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇతర ప్రజా సంబంధ కారణాలతోనే మోడీపై గొంతు పెంచుతున్నారా? లేక కేసుల భయంతోనా? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.
నిన్న వారు, నేడు కేసీఆర్
కేసీఆర్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విశ్లేషణలు జరుగుతున్నాయి. గతంలో కమల్ హాసన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులు దక్షిణాదిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కేసీఆర్ ఏకంగా అవకాశమొస్తే తెలంగాణ వ్యక్తి దేశ రాజకీయాలను నడిపితే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు. ఫ్రంట్ కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
గత కొన్నాళ్లుగా గొంతు పెంచుతున్నారు
పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ వంటి వారు దక్షిణాది గురించి మాట్లాడుతున్నారు. కమల్ పార్టీ గుర్తులోనే దక్షిణాది రాష్ట్రాలకు చోటు కల్పించారు. పవన్ నోట దక్షిణాది నిర్లక్ష్యం అనే మాట పలుమార్లు విన్నాం. కేంద్రం తీరుపై టీడీపీ ఇటీవల గుర్రుగా ఉంది. కమల్ హాసన్తో ఫోన్లో మాట్లాడిన తర్వాత చంద్రబాబు కూడా మోడీపై గొంతు పెంచారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఘాటైన విమర్శలు చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా టీడీపీ, ఇప్పుడు టీఆర్ఎస్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నారు.
బీజేపీ దూసుకొస్తుందనే భయంతోనా
ఈ నేపథ్యంలో ఫ్రంట్ దక్షిణాది ప్రాధాన్యంగా ఉంటుందా? లేక దేశవ్యాప్తంగా బీజేపీ విజయదుందుభిని ఎదుర్కొనేందుకు అందరితో కలిసి ముందుకు సాగుతారా అనే చర్చ సాగుతోంది. మిగతా వారు దక్షిణాది గురించి మాట్లాడితే, కేసీఆర్ వ్యాఖ్యలు మాత్రం దేశవ్యాప్తంగా అనేలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ ఆయా రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో తమకు చెక్ పెట్టవద్దనే భయంతో కేసీఆర్.. మోడీపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ చెబుతోంది.
మోడీ దెబ్బతో గుబులు, నిన్న బాబు, నేడు కేసీఆర్-స్టాలిన్ హెచ్చరిక: దండయాత్రకు చెక్
కేసుల భయంతో.. మోడీకి షాకిచ్చేందుకు థర్డ్ ఫ్రంట్
కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం మరో విధంగా చెబుతున్నారు. మోడీ, కేసీఆర్ దోస్తీలేనని, ప్రగతిశీలశక్తులు, మైనార్టీలను దూరం చేసుకోకుండా ఉండేందుకు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని, ఎప్పటికైనా మోడీ-కేసీఆర్ దోస్తీలేనని చెబుతున్నారు. ఏపీ కాంగ్రెస్ నేత సీ రామచంద్రయ్య మరో అడుగు ముందుకేసి.. కేసులకు భయపడి కేసీఆర్, చంద్రబాబులు థర్డ్ ఫ్రంట్ అనే నినాదం ఎత్తుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. శశికళ, లాలూ ప్రసాద్ మాదిరి కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని, కేసుల భయంతో ఆయన థర్డ్ ఫ్రంట్ తెరపైకి తెచ్చారని మధుయాష్కీ అన్నారు. 2019 ఎన్నికలకు ముందు థర్డ్ ఫ్రంట్ పేరుతో బీజేపీని ఆందోళనకు గురి చేసి కేసుల నుంచి తప్పించుకోవడంతో పాటు లబ్ధి పొందడం వారి ఉద్దేశ్యమని కొందరు ఆభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ఓట్లను చీల్చేందుకు, తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ లాభపడేలా ఆ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయనేది కాంగ్రెస్ నేతల వాదన.
బాబుతో కమల్హాసన్ భేటీ?: మోడీకి 'దక్షిణాది' చెక్, ఆ తర్వాతే గొంతుపెంచిన టీడీపీ అధినేత!
థర్డ్ ఫ్రంట్లో ఎవరెవరు?
బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక శక్తులతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబుసోరెన్, డీఎంకే అధినేత స్టాలిన్, సమాజ్వాది పార్టీ అఖిలేష్ యాదవ్, జేడీఎస్ కుమారస్వామి తదితరులతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఈ ఫ్రంట్లో చంద్రబాబు కూడా ఉంటారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
హోదాపై కేసీఆర్ వ్యాఖ్యల వెనుక
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ గట్టిగా చెప్పారు. హోదా ఇవ్వమని, దానికి సమానమైన ప్యాకేజీ ఇస్తామని బీజేపీ తేల్చి చెప్పింది. అయినప్పటికీ హోదా ఇస్తే ఇస్తా అనాలి లేదంటే లేదు అనాలి అని కేసీఆర్ చెప్పారు. బీజేపీ తేల్చి చెప్పిన విషయం తెలిసి కూడా.. ఏపీ మద్దతు కోసమే ఆయన అలా మాట్లాడారని అంటున్నారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పడితే.. తెలంగాణతో పాటు ఏపీ మద్దతు కూడా కీలకం. అందుకే ఆయన హోదా కోసం వ్యూహాత్మకంగానే గత కొన్నాళ్లుగా మద్దతిస్తున్నారని అంటున్నారు. అంతకుముందు ఏపీకి హోదా ఇస్తే తమకు ఇవ్వాలనే విధంగా తెరాస నేతల తీరు ఉండేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు హోదాపై మరో టర్న్ తీసుకోవడం వెనుక.. తెలుగు రాష్ట్రాల మద్దతు కోసమే కావొచ్చని అంటున్నారు.
ప్రధాని పదవిపై కన్ను, బాబు కంటే ముందే
కేసీఆర్ కన్ను ప్రధానమంత్రి పదవిపై పడిందని ఏకంగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకే జాతీయస్థాయిలో చక్రం తిప్పాలని ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ కూడా గత కొంతకాలంగా ఫ్రంట్ గురించి మాట్లాడుతోంది. చంద్రబాబు కంటే ముందే, చక్రం తిప్పాలనే ఆలోచనలో కేసీఆర్ ఉండవచ్చునని అంటున్నారు.
ఒక్కటై అడ్డుకునేందుకు
2014లో మోడీ ప్రధాని అయ్యాక బీజేపీ ఐదు రాష్ట్రాల నుంచి 21 రాష్ట్రాలను తమ వశం చేసుకుంది. అందులో మిత్రపక్షాల పార్టీలు కూడా ఉన్నాయి.తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం ఆరెస్సెస్ వర్క్ చేస్తోంది. యూపీలో ఆరెస్సెస్, ఈశాన్య రాష్ట్రాల్లో ఆరెస్సెస్ వింగ్ వనవాసీ కళ్యాణ్ కమలం గెలుపు కోసం పని చేస్తోంది. తెలంగాణలోను ఆ ప్రభావం పడుతుందని కేసీఆర్లో ఆందోళన ఉందని అంటున్నారు. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని, కాబట్టి ఆయా రాష్ట్రాల్లో కీలక ప్రాంతీయ పార్టీలు కలిసి ఫ్రంట్గా ఏర్పడి బీజేపీ దూకుడును అడ్డుకోవాలని భావిస్తున్నాయని అంటున్నారు.
పవన్, చంద్రబాబు ఎలా స్పందిస్తారు
మోడీపై ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ వంటి వారు కూడా ఆగ్రహిస్తున్నారు. చంద్రబాబు, స్టాలిన్లు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఉత్తరాదిన బీజేపీ ధాటికి ప్రాంతీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఇలా అందరితో కలిసి ముందుకెళ్లాలని భావిస్తున్నారు. మోడీపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న కేసీఆర్ ఫ్రంట్ను పవన్ కళ్యాణ్ స్వాగతించారు. చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఫ్రంట్ ఏర్పడితే లీడ్ చేయాలని చంద్రబాబు ఉవ్వీళ్లూరుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఉవ్వీళ్లూరుతున్నారు.