కేసీఆర్ కు మొదలైన టార్చర్ .. ఏపీని చూసైనా కళ్ళు తెరువు... కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి
Recommended Video
తెలంగాణ సీఎం కేసీఆర్ కు టార్చర్ మొదలైంది. పక్క రాష్ట్ర సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోమని కెసిఆర్ కు హితబోధ చేయడం ప్రారంభమైంది. ఇది భవిష్యత్తులో కేసీఆర్ కు ఇబ్బందికర పరిణామాలను తీసుకు వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకపక్క నిన్నగాక మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలన దిశగా అడుగులు వేస్తుంటే, అసలు పాలన విషయమే మరిచిపోయారు కెసిఆర్ పై విరుచుకు పడుతున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు.
సంచలన వ్యాఖ్యలతో ఆక్రోశం వెళ్ళగక్కిన వీహెచ్ .. అసలు ఆయన బాధ ఏమిటంటే
మొన్న కేసీఆర్ కంటే జగన్ బెటర్ అన్న మందా కృష్ణ మాదిగా
మొన్నటికి మొన్న మందకృష్ణ మాదిగ కేసీఆర్ కంటే జగన్ బెటర్ వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ కి కి తాబిచ్చి మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారని, దళితులకు క్యాబినెట్లో సముచిత స్థానం ఇచ్చారని, సమన్యాయం పాటించారని పేర్కొంటూనే ఇక కెసిఆర్ జగన్ ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. అతి తక్కువ కాలంలో మంచి పాలన సాగిస్తున్న జగన్ ను చూసి కెసిఆర్ నేర్చుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, పాలన పడకేసింది అని ఆయన మండిపడ్డారు.
జగన్ ను చూసైనా కేసీఆర్ మారతారా అన్న విజయశాంతి
ఇక తాజాగా విజయశాంతి సైతం సీఎం కేసీఆర్ జగన్ ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. మహిళల పట్ల కేసీఆర్ కు చిన్నచూపు ఉంది కాబట్టే మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని, కానీ జగన్ మంత్రివర్గంలో మహిళను డిప్యూటీ సీఎం చేయడంతో పాటుగా, అత్యంత కీలకమైన హోమ్ మినిస్టర్ గా కూడా మహిళకు అవకాశమిచ్చారని విజయశాంతి పేర్కొన్నారు. నిన్నగాక మొన్న పాలనా పగ్గాలు చేపట్టిన జగన్ ను చూసైనా కెసిఆర్ మారతారా అని ప్రశ్నించారు.
ఇక తాజాగా ఎపీని చూసి నేర్చుకో .. అంటూ క్లాస్ పీకిన జీవన్ రెడ్డి
ఇక తాజాగా సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పక్క రాష్ట్ర పాలన చూసైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరవాలని ఆయన మండిపడ్డారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి బాటలో పయనిస్తున్నారు అంటూ మెచ్చుకున్న జీవన్ రెడ్డి తెలంగాణ సర్కార్ పై ఘాటైన విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం రెండు డీఎస్సీలో పూర్తి చేసిందని, కానీ తెలంగాణ రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేదని ఆయన మండిపడ్డారు. విద్య పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదంటూ కేజీ టూ పీజీ ఉచిత విద్య విషయం కేసీఆర్ మర్చిపోయారని మంది పడ్డారు. తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి విద్యార్థుల సంఖ్య కంటే ఉపాధ్యాయులే ఎక్కువ ఉన్నారంటూ విద్యాశాఖ మంత్రి చెప్పడాన్ని తప్పుపట్టారు. అంతేకాదు కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, తాము అందిస్తున్న పథకాలు దేశంలోనే గొప్ప పథకాలు అంటూ గొప్పలు చెప్పుకోవడానికి పరిమితమైందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీని చూసైనా సీఎం కేసీఆర్ పాలన నేర్చుకోవాలని జీవన్ రెడ్డి హితవు పలికారు.
జగన్ తో పోలుస్తూ కేసీఆర్ కు టార్చర్ చూపిస్తున్న నేతలు
వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇరు రాష్ట్రాల సీఎంల పనితీరును గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సీఎం అయిన తర్వాత చకచకా నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తన మార్కు చూపిస్తుంటే కెసిఆర్ మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ తెలంగాణలో పాలనను మర్చిపోయారని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ప్రతి అంశంలోనూ జగన్ తో పోలుస్తూ కెసిఆర్ కు టార్చర్ చూపిస్తున్నారు .