కావాలని చేస్తే, కెసిఆర్ సారీ చెప్పాలి: రేవంత్, నాన్న హరికృష్ణనూ ఎప్పుడు కొట్టలేదు: బాలకృష్ణ
హైదరాబాద్: రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన స్వర్గీయ నందమూరి తారక రామారావును తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విస్మరించడం దారుణమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, టిడిపి మరో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సోమవారం అన్నారు.
ఈ విషయమై వెంటనే తెలుగు ప్రజలకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం లాంఛనంగా నిర్వహించకపోగా, నిర్వహించడానికి తమకు అనుమతులివ్వకుండా అడ్డుపడటంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఉంటే బాధ్యులను సస్పెండ్ చేయాలని, కావాలనే ముఖ్యమంత్రి చేస్తే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
స్వాతంత్య్రానికి ముందు-తర్వాత అన్నట్లుగా ఎన్టీఆర్కు ముందు-తర్వాత అన్నట్లుగా తెలుగు ప్రజలు ఆయన్ను గుర్తు పెట్టుకున్నారని నందమూరి బాలకృష్ణ వేరుగా అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల ద్వారా 14,300 యూనిట్ల రక్తం సేకరించామన్నారు.
సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలుగువారి జ్ఞాపకాలు పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ పొందిన వారిని బాలకృష్ణ, లోకేష్, బ్రహ్మణిలు అభినందించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... నాన్నగారు తనను ఎప్పుడూ కొట్టలేదని, అన్నయ్య హరికృష్టను కూడా సినిమా సన్నివేశంలో తప్ప బయట చేయి చేసుకోలేదని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ స్వరం బాగుండడం కోసం రోజుకు రెండు చుట్టలు కాల్చేవారన్నారు.