ఇదేం న్యాయం: కెసిఆర్కు భట్టి సూటి ప్రశ్న, సంక్రాంతి కెసిఆర్ 'గ్రేటర్' ప్లాన్: మర్రి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లుభట్టి విక్రమార్క సోమవారం నాడు మండిపడ్డారు. గతంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన కెసిఆర్పై సీబీఐ చేస్తున్న దర్యాప్తు మీద ఆయన స్పందించకపోవడాన్ని భట్టి నిలదీశారు.
కేంద్రమంత్రిగా కేసీఆర్ అవినీతికి పాల్పడి ఉంటే సీఎం పదవిలో ఎలా కొనసాగుతారని సూటిగా ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేశారని గుర్తు చేశారు. అదే నీతిసూత్రం కేసీఆర్కు వర్తించదా? అన్నారు.
కెసిఆర్ పదవి నుంచి దిగిపోతారో లేక తనను తాను శిక్షించుకుంటారో ప్రజలకు చెప్పాలన్నారు. పిఎఫ్ స్కాం పైన విచారణ జరపాలని సుప్రీం కోర్టులో కేసు వేస్తామని చెప్పారు. సిబిఐ విచారణ పైన ఇప్పటికైనా కెసిఆర్ మౌనం వీడాలన్నారు.
పత్రికలకు లీకులు ఇచ్చి అవినీతి ఆరోపణలతో రాజయ్యను బర్తరఫ్ చేశారని ఆరోపించారు. కెసిఆర్ పైన ఈగ వాలితే సహించలేని వందిమాగదులు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. వనరులను కెసిఆర్ కుటుంబ సభ్యులు దోపిడీ చేస్తున్నారన్నారు.
సీమాంధ్రులు ఓటేయకుండా: మర్రి
జీహెచ్ఎంసీ ఎన్నికలు మరోసారి వాయిదా వేయించుకున్న ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లో 35 శాతం ఉన్న సీమాంధ్రులు ఓట్లు వేయకుండా చూసేందుకే సంక్రాంత్రికి ఎన్నికలు పెట్టాలనుకుంటున్నారని సంచలన ఆరోపణ చేశారు.
సీఎం కేసీఆర్కు ఇష్టం వచ్చినట్టు వార్డుల విభజన చేశారన్నారు. గ్రేటర్ ఓట్ల తొలగింపుపై ఈసీ నిర్ణయం తీసుకునే వరకు వార్డుల విభజన నోటిఫకేషన్ ఆపాలన్నారు. కో అప్టెడ్ సభ్యులను నియమించుకోవడం కుదరదన్న కారణంతో వార్డుల సంఖ్య పెంపుపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. జనాభాకు తగ్గట్టు వార్డుల సంఖ్య పెంచాలన్నారు.
జనవరి 31లోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు
వచ్చే ఏడాది జనవరి 31లోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్ను హైకోర్టు అంగీకరించింది. అయితే దానికి సంబంధించిన ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎన్నికల నిర్వహణకు ఎందుకు సమయం తీసుకుంటున్నారని కోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆధార్ అనుసంధానం, వార్డుల విభజన ప్రక్రియ వల్ల ఎన్నికల నిర్వహణలో ఆలస్యం జరుగుతోందని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. జనవరి 31 వరకు ఎన్నికలు నిర్వహిస్తామని సూచించగా, కోర్టు అనుమతించింది.