కెసిఆర్ గైర్హాజరు: శ్రీవారికి మనవడి పట్టువస్త్రాలు, చెలరేగుతున్న దుమారం
కెసిఆర్ మనువడు హిమాన్షు శ్రీరామనవమి సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడంపై దుమారం చెలరేగుతోంది. కెసిఆర్ గైర్హాజరయ్యారు.
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని భద్రచల రాముడి ఉత్సవాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గైర్హాజరయ్యారు. అదే సమయంలో ఆయన మనువడు హిమాన్షు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ విషయంపై పెద్ద దుమారమే చెలరేగుతోంది.
ఆ సంఘటనపై బిజెపి మండిపడతోంది. ఆ రకంగా కెసిఆర్ హిందువులను కించపరిచారని దుమ్మెత్తిపోస్తోంది. ముఖ్యమంత్రి దంపతులు భద్రాచల రాముడికి పట్టువస్త్రాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఆ సంప్రదాయాన్ని, ఆచారాన్ని కెసిఆర్ తుంగలో తొక్కారని బిజెపి మండిపడుతోంది.
కెసిఆర్ మనవడు ప్రభుత్వ ప్రతినిధి ఎలా అవుతాడని బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. అది శ్రీవారి గౌరవాన్ని తగ్గించకడం కాదా బిజెపి అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు ప్రశ్నించారు.
కెసిఆర్ మనువడు హిమాన్షు ఇలా....
హిమాన్షు పట్టువస్త్రాల పళ్లాన్ని శిరసుపై ధరించి వాటిని శ్రీవారికి సమర్పించారు. దాంతో వివాదం చెలరేగుతోంది. హిమాన్షు పట్టవస్త్రాలను దైవ సన్నిధిలో ఉంచడానికి ప్రయత్నించాడు. అయితే, కాస్తా ఆగాల్సిందిగా పూజారులు సంకేతాలు ఇచ్చారు. మరోసారి పట్టువస్త్రాలను సమర్పించడానికి ప్రయత్నించాడు. కానీ అతన్ని ఆపేశారు. కొన్ని నియమాల తర్వాత పట్టు వస్త్రాలను సమర్పించడానికి పూజారులు హిమాన్షును అనుమతించారు.
కుటుంబం తరఫుననే హిమాన్షు...
కుటుంబ సభ్యుల తరఫుననే హిమాన్షు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే, ప్రభుత్వం తరఫున ఆయన పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్లు పూజారులు సంకేతాలు ఇచ్చారనే మాట వినిపిస్తోంది. అందువల్ల అది ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించినట్లు కాదని అంటున్నారు. కెసిఆర్ సతీమణి శోభ, కుమారుడు కెటి రామారావు, కెసిఆర్ మనువడు హిమాన్షు, ఇతర కుటుంబ సభ్యులు శ్రీవారి ఉత్సవాలకు హాజరయ్యారు. కెసిఆర్ కుటుంబం తరఫున హిమాన్షు పట్టువస్త్రాలు సమర్పించారు.
అనారోగ్యం కారణంగానే కెసిఆర్ గైర్హాజరు...
అనారోగ్యం కారణంగానే కెసిఆర్ భద్రాచల రాముడి శ్రీరామ నవమి ఉత్సవాలకు హాజరు కాలేదని తెలుస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి శ్రీవారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. ఊరేగింపుగా వచ్చి ఆయన వాటిని శ్రీవారికి సమర్పించారు.
దత్తాత్రేయ హాజరు...
భద్రాచలంలోని శ్రీరామనవమి ఉత్సవాలకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా హాజరయ్యారు. వారు పూజలు చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను శ్రీవారికి సమర్పించారు.