డీకే అరుణా! కాస్కో నీ బండారం బయటపెడతా, ఆధారాలు: కేసీఆర్ తిట్ల దండకం
వనపర్తి: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. సభలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణపై నిప్పులు చెరిగారు.
టీఆర్ఎస్ ఏం చేసినా, 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు: రేవంత్ రెడ్డి ధీమా
డీకే అరుణ నిన్న గద్వాలలో కత్తులు తిప్పారని, కానీ పోతిరెడ్డిపాడు నుంచి రఘువీరా రెడ్డి నీళ్లు తీసుకు వెళ్తుంటే సిగ్గులేకుండా మంగళహారతి ఇచ్చిందని నిప్పులు చెరిగారు. ఇందుకు సంబంధించి మా వద్ద వీడియోలు ఉన్నాయని, గద్వాలలో ప్రతి ఇంటికి చూపిద్దామని చెప్పారు.
ఒళ్లు దగ్గర పెట్టుకో, వీడియోలు ఉన్నాయి, నీ బండారం బయటపెడతా
నిన్న డీకే అరుణ కాస్కో నా కొడుకా అని మాట్లాడుతున్నారని, డీకే అరుణ.. కాస్కో నీ బండారం బయటపెడతామని కేసీఆర్ హెచ్చరించారు. డీకే అరుణ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, ఆమె బండారం బయటపెడతామని వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకు వెళ్తే తాను గొడవ పడ్డానని చెప్పారు. తెరాస నేతలు పదవులను త్యాగం చేస్తే, ఇదే జిల్లాకు చెందిన దరిద్రులు (కాంగ్రెస్ నేతలు) మంగళహారతులు పట్టారని విమర్శించారు. ఇప్పుడు వనపర్తి తదితర ప్రాంతాల్లో నీళ్లు నింపుతున్న నిరంజన్ రెడ్డి కావాలా, కాంగ్రెస్ నేతలు కావాలా అని నిలదీశారు.
కేసీఆర్ చెప్పిండని ఓటు వేయకండి
తెలంగాణ ఉద్యమం సమయంలో కనీసం వందసార్లు తాను మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చానని చెప్పారు. అరవై ఏళ్లు పాలించిన టీడీపీ, కాంగ్రెస్ పాలనలో ఎలా ఉంది, ఇప్పుడు మహబూబ్ నగర్ ఎలా ఉందని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పిన మాట విని, ఉత్తినే ఓటు వేయవద్దని, తాను చెప్పిన మాటలపై గ్రామాల్లో చర్చించి, ఓటు వేయాలని సూచించారు. కూలిపోయిన కులవృత్తులు, చావులు ఇలాంటి తెలంగాణను సమైక్య పాలకులు మనకు అప్పగించారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ గొర్రెలకు ఏం తెలుసు?
గొర్రెలు, మేకలు, చేపలు ఇచ్చేందుకు తాము అసెంబ్లీలో మాట్లాడితే, ఇక్కడి కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి, గొర్రెలు, చేపలే ఉన్నాయా అని సెటైర్లు వేశారని కేసీఆర్ మండిపడ్డారు. గొర్రెల గురించి ఈ కాంగ్రెస్ గొర్రెలకు తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో గొల్ల కురుమలు 30 లక్షల మంది ఉన్నారని, కానీ నాటి పాలకులు వారి కులవృత్తిని కూలగొట్టారన్నారు. సమైక్య పాలనలో నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలు రవాణా అయ్యేవని, కానీ ఇప్పుడు ఇక్కడే గొర్రెలు పంపిణీ చేశామన్నారు. ధనవంతులైన గొల్ల కురుములు తెలంగాణలో ఉన్నారన్నారు. చేపలు పట్టే గంగపుత్రులు, తెలగవాళ్లు 40 లక్షలమంది ఉన్నారని వారిని ఆదుకున్నామని చెప్పారు. నాడు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే వారని, ఇప్పుడు అవి ఆగిపోయాయని చెప్పారు. గీత కార్మికులు పన్ను మాఫీ చేశామని, నాయీ బ్రాహ్మణ సోదరులకు కమర్షియల్ కరెంట్ ఛార్జీ తొలగించామని చెప్పారు. రజక సోదరులను కూడా ఆదుకున్నామన్నారు.
వీళ్లు తెలంగాణలో ఎట్లా పుట్టారు?
ఆంధ్రా పాలకులకు సంచులు మోసి బతికారని, ఈ కాంగ్రెస్ నేతలకు తెలివి లేదని, అందుకే అసెంబ్లీ నుంచి పారిపోయారని కేసీఆర్ అన్నారు. ఓ సమయంలో మాత్రం వారి దొరికారని, చర్చిద్దామంటే తాము సిద్ధమై రాలేదని చెప్పారని, మరి అసెంబ్లీకి పీకనికి వచ్చారా అని దుయ్యబట్టారు. వైయస్ రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు పోతిరెడ్డిపాడు వద్ద రంధ్రం చేసి నీళ్లు తోడుకొని పోతే కాంగ్రెస్ నేతలు స్పందించలేదన్నారు. వీళ్లు తెలంగాణలో ఎట్లా పుట్టారని అనిపిస్తోందని మండిపడ్డారు. చిన్నారెడ్డి వంటి నేతలు మంత్రి పదవి కోసం సమైక్య పాలకులకు వంత పాడారని ధ్వజమెత్తారు. రఘువీరా రెడ్డి హంద్రీనీవా నుంచి నీళ్లు తీసుకువెళ్తే మాట్లాడలేదన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకెళ్తే నష్టం లేదని చిన్నారెడ్డి వ్యాసాలు రాశారన్నారు. ఓటుకు నోటు కేసును లాగి, రేవంత్ రెడ్డిని బుడ్డరఖాన్ అని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర లేదా, డబ్బులు ఇస్తూ నీ బుడ్డరఖాన్ దొరకలేదా అని ప్రశ్నించారు.