ముద్దుల గోలేమిటి: కెసిఆర్, రోహిత్ ఘటనపై ఎందుకు మాట్లాడలేదంటే...
హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో కిస్ ఫెస్టివల్స్ నిర్వహించడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తప్పు పట్టారు. విశ్వవిద్యాలయాల్లో అటువంటి ఉత్సవాలు నిర్వహించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం శాసనసభలో మాట్లాడుతూ ఆ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన, ఢిల్లీ జెఎన్యు ఘటన అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. సంకుచిత రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరి కాదనే ఉద్దేశంతోనే తాను వేముల రోహిత్ ఘటనపై తాను మౌనం వహించినట్లు ఆయన తెలిపారు. కానీ విశ్వవిద్యాలయంలో సాధారణ పరిస్థితులను కల్పించడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నట్లు తెలిపారు.
విశ్వవిద్యాలయాల్లో కిస్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారని విన్నప్పుడు తాను షాక్ తిన్నట్లు తెలిపారు. అది సరైందేనా అని అడిగారు. దాన్ని ఎవరైనా అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించకపోవడంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు.
ఉత్తమ వ్యక్తిత్వం, సమగ్రత, విలువలు ఉన్న వ్యక్తులను వీసీలుగా నియమించాలని, అటువంటి వారి కోసం అన్వేషణ సాగుతోందని కెసిఆర్ చెప్పారు. వీసీల నియామకం కోసం చట్టం మార్పు కోసం గవర్నర్ అనుమతి కోరామని, అత్యంత విద్యావంతులైన మేధావులను నియమించడానికి తాము ఆ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.