కేసీఆర్ కొత్తగా ఏమి చెప్పారని...ప్రసంగమంతా పాతచింతకాయ పచ్చడే: రేవంత్ రెడ్డి
Recommended Video
కొన్ని లక్షల మందితో ప్రగతినివేదన సభ పెట్టిన టీఆర్ఎస్ ఆసభ ముగియగానే కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేసే నేత రేవంత్ రెడ్డి తనదైన శైలిలో మరోసారి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రసంగం పాతచింతకాయ పచ్చడిలా ఉందన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేదని మండిపడ్డారు. కేసీఆర్ మాటలు చూస్తే ముందస్తు ఎన్నికల నిర్ణయం వాయిదా వేసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. తానే మరో మారు సీఎం కావాలని అందుకోసం ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ సభను ఏర్పాటు చేసినట్లు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
ఇక కేసీఆర్ ప్రసంగం చూస్తే అందులో ఏదీ కనిపించలేదని చెప్పారు. ఏ ఒక్క అంశంపైనా కేసీఆర్ క్లారిటీ ఇవ్వలేదని చెప్పారు. నాడు మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దివాల తీసిందని, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీలు చాలా వరకు నెరవేరలేదని విమర్శించారు. ఏదైనా లాభం వచ్చిందంటే టీఆర్ఎస్ చేసిందని, నష్టం వస్తే కాంగ్రెస్ పార్టీ పాపమేనని చెప్పడం కేసీఆర్ కు అలవాటైపోయిందని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. మరోవైపు తెలంగాణలో కన్నా ఏపీలోనే సంక్షేమం వేగంగా జరుగుతోందని అన్నారు రేవంత్ రెడ్డి. లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని ఆయన కొనియాడారు. మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ ఒకేసారి రైతు రుణమాఫీలు ఎందుకు చేయలేకపోయారని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ఇక తన కొడుకు కేటీఆర్ కోసమే కేసీఆర్ లైన్ క్లియర్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి లోపభూయిష్ట నిర్ణయాలు, కేంద్రంలో నరేంద్రమోడీతో లాలూచీ పడి తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు తెలంగాకు కేసీఆర్ కుటుంబం అత్యంత ప్రమాదకరంగా పరిణమించిందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కలిగితేనే తెలంగాణలోని రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలు, దళితులకు మైనార్టీలకు మేలు జరుగుతుందని రేవంత్ అన్నారు.