స్టాలిన్-కేసీఆర్ భేటీలో థర్డ్ ఫ్రంట్ చర్చ జరగలేదు: కనిమొళి ఆసక్తికర వ్యాఖ్య
చెన్నై: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భేటీ సందర్భంగా థర్డ్ ఫ్రంట్ అంశం ప్రస్తావనకు రాలేదని డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, పార్లమెంటు సభ్యురాలు కనిమొళి అన్నారు.
చెన్నై విమానాశ్రయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. స్టాలిన్ భేటీ రాజకీయ కూటమి దృష్టితో జరగలేదని చెప్పారు. రాష్ట్రాల హక్కుల గురించే చర్చించామని తెలిపారు. కేంద్రం నుంచి దేనినీ డిమాండ్ చేసి పొందలేని పరిస్థితిలో అన్నాడీఎంకే ఉండటం చూస్తే జాలేస్తోందన్నారు.
కాగా, బుధవారం అఖిలేష్ యాదవ్తో భేటీ అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలోని పలు పార్టీలు కలిసి దేశంలో మార్పుకు ప్రయత్నిస్తున్నాయని, నిరాశపడవద్దని, రెండు, రెండున్నర నెలల్లోనే పూర్తి అజెండాతో దేశం ముందుకు వస్తామని కేసీఆర్ చెప్పారు. మాతో కలిసి వచ్చేవాళ్లందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని, ఇంత పెద్ద దేశం కోసం ఒక ఎజెండా తయారు చేయడం కేవలం ఒకరిద్దరితోనో, ఒక పార్టీతో అయ్యే పనికాదని, అనేక అంశాలను, అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇది మంచి ప్రారంభమన్నారు.
ఇంత తక్కువ సమయంలోనే చాలామంది కలుస్తున్నారని, ఇందులో చిన్నచిన్న అంశాలు తీయవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని, మేం ఒక ఎజెండా రూపొందించుకుంటామని, తమ కూటమికి డ్రైవింగ్ ఫోర్స్, మేం రూపొందించుకునే అజెండానే అవుతుందని కేసీఆర్ చెప్పారు.
కాంగ్రెస్ తరఫున కర్ణాటకలో ప్రచారం చేస్తారా? అని విలికవిలేకరుల ప్రశ్నకు అఖిలేశ్ సమాధానం ఇస్తూ... హైదరాబాద్ నుంచి కర్ణాటక చాలా దగ్గర. కానీ, నేను కర్ణాటకకు వెళ్లడం లేదు. లక్నోకు వెళ్తున్నా అని నవ్వుతూ చెప్పారు.