కేసీఆర్ - స్టాలిన్ భేటీ ఉందా..!? ఆధ్యాత్మిక పర్యటనకు రాజకీయ రంగు పులుముతున్నారా...?
హైదరాబాద్: తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు నేడు డీఎంకే అధినేత స్టాలిన్తో భేటీ కానున్నారు. ఇవాళ తమిళనాడులోని శ్రీరంగం, తిరుచ్చి ఆలయాలను ఆయన దర్శించుకుంటారు. ఆదివారం తమిళనాడుకు బయలుదేరి వెళ్లారు. నిన్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు అనంతరం ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తమిళనాడు బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు పర్యటించిన చంద్రశేఖర్ రావు, శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తమిళనాడు వెళ్లిన సమయంలో స్టాలిన్ బిజీగా ఉండటంతో కలవడం సాధ్యపడలేదు. దీంతో ఆయన మళ్లీ తమిళనాడు వెళ్లారు.
మొక్కులా.. రాజకీయ ట్రిక్కులా..! తమిళనాడులో ఏం జరుగుతోంది..?
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు దగ్గరపడుతుండటంతో రాష్ట్రాల బాటపట్టిన చంద్రశేఖర్ రావు పార్టీల అధినేతలు, సీఎంలతో భేటీ అవుతూ బిజిబిజీగా గడుపుతున్నారు. అయితే ఇప్పటికే ఒక దఫా దాదాపు తనకు అనుకూలంగా రాష్ట్రాలన్నీ తిరిగొచ్చిన చంద్రశేఖర్ రావు రెండోసారి మళ్లీ ఫెడరల్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవలే కేరళ వెళ్లిన చంద్రశేఖర్ రావు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్తో భేటీ అయ్యి కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ మెజార్టీ సీట్లు దక్కించుకుని గెలిచే అవకాశాల్లేవని ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని నిశితంగా వివరించారు.
భేటీ జరుగుతుందటున్న గులాబీ నేతలు..! ఇంకా స్పష్టత ఇవ్వని స్టాలిస్ వర్గాలు..!!
నేడు డీఎంకే అధినేత స్టాలిన్తో చంద్రశేఖర్ రావు భేటీ కానున్నారు. మొదట స్టాలిన్తో భేటీ కావాలనుకున్న చంద్రశేఖర్ రావుకు అడ్డంకులు ఎదురయ్యాయని అందరూ భావించారు. మీడియాలో సైతం పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఇందుకు కారణం ఒకటి.. ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీబిజీగా ఉండటం.. రెండోది ఆయన ప్రస్తుతం కాంగ్రెస్తో చేతులు కలపడంతో చంద్రశేఖర్ రావుతో భేటీకి నిరాకరించారన్నదే ఆ వార్తల సారాంశం. అయితే ఎట్టకేలకు ముందుగా అనుకున్నట్లుగానే మే-13 రోజే స్టాలిన్తో చంద్రశేఖర్ రావు భేటీ అవుతున్నారు. అయితే స్ఠాలిన్ కార్యాలయం నుండి వీరి భేటీకి సంబందించి ఎలాంటి స్పష్టత రాకపోవడం గమనార్హం.
ప్రసిద్ద దేవాలయాలు సందర్శించుకుంటున్న కేసీఆర్..! మరి ఫ్రంట్ పరిస్థితి ఏంటి..?
ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ గురించి నిశితంగా వివరించి ఫ్రంట్లోకి చంద్రశేఖర్ రావు ఆహ్వానించనున్నారు. అయితే స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? రెడ్ సిగ్నల్ ఇస్తారా..? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ భేటీపై అటు కాంగ్రెస్ నేతల్లో.. ఇటు టీఆర్ఎస్, డీఎంకే నేతల్లో టెన్షన్ మొదలైందట. ఇదిలా ఉంటే... స్టాలిన్తో భేటీ అనంతరం చంద్రశేఖర్ రావు కర్నాటకలో పర్యటిస్తారని తెలుస్తోంది. పర్యటనలో భాగంగా కర్నాటక సీఎం కుమారస్వామితో భేటీ అయ్యి ఫెడరల్ ఫ్రంట్ విషయమై చర్చించనున్నారు. అయితే కాంగ్రెస్-జేడీఎస్ కలిసి కుమార స్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
అందరూ కాంగ్రెస్ తో అంటకాగే వారే..! కేసీఆర్ తో ఎలా నడుస్తారు..?
అయితే రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో కలిసే జేడీఎస్ నడిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ తరుణంలో చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్కు కుమారస్వామి ఓకే అంటారా..? లేకుంటే నో చెప్పి పంపుతారా అన్నది తెలియాల్సి ఉంది. సో.. మొత్తానికి చూస్తే తమిళనాడు, కర్ణాటకలో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఏ మాత్రం సక్సెస్ అవుతాయో వేచి చూడాల్సి ఉంది. చంద్రశేఖర్ రావు ఫ్రంట్ ప్రయత్నాలు కూడా కాంగ్రెస్ ను కాదని ముందుకు వెళ్లే అవకాశాలు కూడా పెద్దగా కనిపించడం లేదు.