ఎర్రవల్లిలో 23 నుంచి: కేసీఆర్ చండీయాగం చేసేది ఇక్కడే (ఫోటోలు)
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన అయుత మహా చండీయాగానికి సమయం దగ్గరపడుతోంది. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడనంతగా గొప్పగా ఈ యాగాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రం సమీపంలోని 22 ఎకరాల్లో చండీ యగాన్ని నిర్వహిస్తున్నారు.
15 రోజుల క్రితమే ప్రారంభమైన పనులు వేగంగా జరుగుతున్నాయి. యాగానికి సమయం దగ్గరపడుతున్న తరుణంలో కేసీఆర్లో ఆతృత పెరిగిపోతోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నిర్దేశిత సమయానికి పనులు పూర్తవుతాయా? లేదా? అన్న ఆందోళన ఆయనను పట్టి పీడిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలుమార్లు ఫామ్హౌస్కు వెళ్లిన కేసీఆర్ స్వయంగా అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. ఆదివారం తన సతీమణితో కలిసి అక్కడికి వెళ్లిన కేసీఆర్ పనుల్లో వేగం పెంచాలని అక్కడికి వారికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
ఎర్రవల్లిలోని 22 ఎకరాల్లో కేసీఆర్ చండీయాగం చేసేది ఇక్కడే
కేసీఆర్ తలపెట్టిన ఆయుత మహా చండీయాగం లక్ష చండీయాగాలతో సమానమని పురోహితులు చెబుతున్నారు. ఆయుత చండీయాగాన్నే శతసహస్ర చండీయాగంగా పేర్కొంటారు. ఒక చండీయాగం కోటి యజ్ఞాల ఫలం, ఆయుత చండీయాగం లక్ష కోట్ల యజ్ఞాల ఫలంగా వేద పండితులు పేర్కొన్నారు.
ఎర్రవల్లిలోని 22 ఎకరాల్లో కేసీఆర్ చండీయాగం చేసేది ఇక్కడే
ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఈ యాగం నిర్వహిస్తారు. కొన్ని దశాబ్దాల కిందట శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఆయుత చండీయాగం నిర్వహించారు. తర్వాత దేశ చరిత్రలోనే మరెక్కడా ఈ యాగం నిర్వహించిన దాఖలాలు లేవు. అత్యంత నియమ, నిష్ఠలతో ఈ యాగం చేయాల్సి ఉంటుందని, సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని వేదపండితులు చెబుతున్నారు.
ఎర్రవల్లిలోని 22 ఎకరాల్లో కేసీఆర్ చండీయాగం చేసేది ఇక్కడే
ఆయుత చండీయాగం నిర్వహణతో వర్షాలు కురిసి రైతులు సుఖసంతోషాలతో ఉంటారని, ప్రకృతి వైపరీత్యాలు దరిచేరవని, ప్రతిఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పారు. త్రిదండి చిన్నజీయర్స్వామి పర్యవేక్షణలో 1100 మంది వేద పండితులు యాగంలో పాల్గొననున్నారు.
ఎర్రవల్లిలోని 22 ఎకరాల్లో కేసీఆర్ చండీయాగం చేసేది ఇక్కడే
ఆయుత చండీయాగం కోసం 10 టన్నుల మోదుగు కర్రలను సేకరిస్తున్నారు. రోజు దాదాపు 10 క్వింటాళ్ల నెయ్యి అవసరం ఉంటుందని ఆ మేరకు సిద్ధం చేస్తున్నారు. నిత్యం సుమారు 30 వేల మంది భోజనాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎర్రవల్లిలోని 22 ఎకరాల్లో కేసీఆర్ చండీయాగం చేసేది ఇక్కడే
వేద పండితులు, పీఠాధిపతుల కోసం తాత్కాలిక ఆవాసాలు నిర్మించనున్నారు. ఎర్రవల్లికి చేరుకునే మార్గాలైన రాజీవ్ రహదారిలోని గౌరారం, జగదేవ్పూర్-గజ్వేల్ రహదారిలో ప్రత్యేక స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ నిర్వాహకులను ఆదేశించారు.