పదేళ్లు పదవుల్లో ఉన్న వారికి చెక్.!ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యత దిశగా కేసీఆర్ అడుగులు.!
హైదరాబాద్ : రాబోవు రోజుల్లో గులాబీ పార్టీలో భారీ మార్పులు చేర్పులు చోటుచేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం గులాబీ బాస్ కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సిద్దించిన తర్వాత స్వీయ పాలనలో పదేళ్ల పాటు వివిధ పదవులు అనుభవించిన నాయత్వాన్ని కాదని, తెలంగాణ మలి దశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ఏ పదవులు అనుభవించకుండా పార్టీ కోసం పనిచేస్తున్న ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు గులాబీ బాస్ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసం యువరాజును రంగంలోకి దించి నాయకులను ఇప్పటినుండే మానసికంగా సంసిద్దం చేసేందుకు రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది.
పీవీకి భారతరత్న .. వ్యతిరేకించిన ఎంఐఎం .. కేసీఆర్ పై , ఎంఐఎంపై మండిపడిన సీతక్క
గులాబీ పార్టీలో భారీ మార్పులు.. కఠినంగా వ్యవహరించనున్న పింక్ బాస్..
తెలంగాణలో కేసీఆర్ అనే మూడక్షరాలకు ఓ బ్రాండ్ ఉంది. ఆ మూడక్షరాలు చేసే పనికి కూడా ఓ ఇమేజ్ ఉంటుంది. చెప్పినవి పదేపదే చెప్పడం, అనుసరించిన విధానాలనే మళ్లీ పదే పదే అనుసరించి బోర్ కొట్టించడం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అస్సలు గిట్టని పని. రాజకీయాల్లో ఎప్పుడూ నూతనత్వంగా ఆలోచిస్తూ కొత్త విధానాలను అనుసరిస్తూ ప్రజానికానికి చంద్రశేఖర్ రావు దగ్గరవుతూ ఉంటారు. అందుకే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇతర పార్టీల నుండి గులాబీ పార్టీలోకి వచ్చిన వారికి సైతం పదువులు కట్టబెట్టి కాంట్రవర్సీ కాకుండా వ్యూహాత్మకంగా వ్యవంహరించారు చంద్రశేఖర్ రావు.
ఇక మీకు చాలు.. ద్వితీయ శ్రేణి నాయకులను గుర్తించాలంటున్న కేసీఆర్..
బంగారు తెలంగాణ కోసం గులాబీ పార్టీలో చేరిన చాలా మంది నాయకులను అక్కున చేర్చుకుని ఆదరించారు చంద్రశేఖర్ రావు. ఉద్యమంలో నిఖార్సుగా పనిచేసిన వారిని కాదని ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారు. సాధించుకున్న తెలంగాణ పునాదుల పటిష్టత కోసం, వ్యతిరేక గళం లేని తెలంగాణ కోసం చంద్రశేఖర్ రావు ఈ పని చేసారనే చర్చ కూడా జరిగింది. తెలంగాణలో దాదాపు ఇతర పార్టీలలో ఉన్న బలమైన నాయకులు మొత్తం గులాబీ పార్టీలోకి చేరిపోయిన పరిస్థితులు తలెత్తాయి. కాని రాబోవు రోజుల్లో, వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్ధితి పూర్తి భిన్నంగా మారిపోబోతున్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు.. భారీ మార్పుల దిశగా గులాబీ పార్టీ..
తెలంగాణ మలిదశ ఉద్యమంలో చంద్రశాఖర్ రావు అడుగులో అడుగు వేసి, తెలంగాణ సాధన ప్రక్రియ వరకూ ప్రయాణించిన వారికి రాజకీయాల్లో సముచిత స్ధానం కల్పించే దిశగా చంద్రశేఖర్ రావు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో అనేక కష్టాలను, నష్టాలను చవిచూసి, పార్టీకోసం చిత్తశుద్దితో పనిచేస్తున్న వారిని ఈ సారి నిరాశపరచకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రశేఖర్ రావు. తెలంగాణ కోసం పనిచేసిన ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో నిరసన గళాలు వినిపించకుండా ఉండే విధంగా పటిష్టంగా వ్యవహరించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
రంగంలోకి దిగిన కేటీఆర్.. పార్టీ పటిష్టతకే ప్రాధాన్యం..
వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు రానున్న గ్రేటర్ ఎన్నికల్లో కూడా సిట్టింగులను కాదని, కొత్తవారికి అవకాశం కల్పించే దిశగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పది సంవత్సరాలుగా పదవులు అనుభవించిన నాయకులు పార్టీకోసం, పార్టీ పటిష్టత కోసం ఎలాంటి కృషి చేసారనే అంశాన్ని ప్రథమంగా పరిగణలోకి తీసుకోబోతోంది గులాబీ పార్టీ అధిష్టానం. అందుకోసం మంత్రి తారకరామారావు అదనపు బాద్యతలు తీసుకుని పదేళ్లుగా పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధుల పనితీరుపై దృష్ఠి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. వ్యతిరేక గళాలు వినిపించినా, నిరసన సెగలు తగిలినా పార్టీలో సంస్థాగత మార్పులు మాత్రం తథ్యం అనే వాతావరణం కనిపిస్తోంది.