దటీజ్ కేసీఆర్ : యూనియన్లు..విపక్షాలు క్లీన్ బౌల్డ్: అసలు వ్యూహం..ఆ ఇద్దరూ..!
కేసీఆర్. ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే. పరిస్థితులను రాజకీయంగా...తనకు అనుకూలంగా మలచుకోవటంలో తన ప్రత్యేకత మరో సారి చాటుకున్నారు. ఆర్టీసీకి భవిష్యత్ లేదన్నారు. ప్రయివేటీకరణ తప్పదన్నారు. కార్మికులు విధుల్లోకి వస్తామంటే...మీ ఇష్టం వచ్చినప్పుడు కుదరదన్నారు. కానీ, సడన్ గా ఒకే ఒక్క మాటతో వాటన్నింటి పైన వచ్చిన వ్యతిరేకతను పోగొట్టుకున్నారు. కార్మికుల మీద ఒత్తిడి.. రియలైజేషన్ తెచ్చేందుకే అలా చేసానన్నారు. కార్మికులు తన బిడ్డలంటూ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. తన మాట వింటే సింగరేణి తరహా బోనస్ వస్తుందన్నారు.
ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ప్రకటించారు. ఒకే దెబ్బకు అటు యూనియన్లు..ప్రతిపక్ష పార్టీలకు దిమ్మ తిరిగే స్ట్రోక్ ఇచ్చారు. ఇటు కార్మికులే తనకు పాలాభిషేకం చేసేలా చక్రం తిప్పారు. పనిలో పనిగా సాధారణ ప్రజానీకం లో తన మీద వ్యతిరేకత రాకుండా సమ్మె కారణంతో ఆర్టీసీ టిక్కెట్ల ధరలు పెంచేసారు. అసలు..కేసీఆర్ ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక కారణం ఏంటి. ప్రభావితం చేసిందెవరు..
ఎమోషనల్ టచ్..పాలాభిషేకాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ తన మీద గుర్రుగా ఉన్న ఆర్టీసీ కార్మికులను ఒకే ఒక ప్రకటనతో తన వైపు తిప్పుకున్నారు. వారంతా తన బిడ్డలంటూ ఎమెషన్ టచ్ ఇచ్చారు. వారి కడుపులు కొట్టనని స్పష్టం చేసారు. ఆత్మ హత్య చేసుకున్న కుటుంబాలకు ఉద్యోగాలస్తామంటూ వారికి ఆత్మ బంధువు అయిపోయారు. తన మాట వింటే సింగరేణి తరహాలో బోనస్ వచ్చేలా చేస్తానని చెప్పారు. అసలు..ప్రయివేటీకరణ విషయంతో తన ఉద్దేశం వేరని..అక్కడా కార్మికులకే మేలు చేయాలనేది తన ఆలోచన అంటూ కార్మికుల మనసులను గెలుచుకొనే ప్రయత్నం చేసారు.అంతే..ముఖ్యమంత్రిని విమర్శించిన వారే ఆయనకు పాలాభిషేకాలు చేసారు.జిందాబాద్ లు కొట్టారు.
ఆ ఇద్దరి ప్రభావం..ఆ రోజే నిర్ణయం
హైకోర్టులో ప్రభుత్వం గెలిచింది. కేసీఆర్..ఇక రాజకీయంగా గెలవటం పైన ఫోకస్ చేసారు. గవర్నర్ వద్దకు వెళ్లారు. పరిస్థితిని వివరించారు. కార్మికుల విషయంలో మానవత్వంతో నిర్ణయం తీసుకోవాలని కోరారు. కానీ, కేసీఆర్ వెంటనే స్పందించలేదు. విధుల్లో చేరుతామని అదే రోజు రాత్రి ముందుకు వచ్చిన కార్మికులను..ఆర్టీసీ ఎండీ ససేమిరా అన్నారు. తన ఇమేజ్ పెంచుకోవటం కోసం కేసీఆర్ వ్యూహంలో ఇదీ ఒక భాగమే. ఇక, హైకోర్టు చీఫ్ జస్టిస్ సైతం ముఖ్యమంత్రితో కార్మికులను ఆదుకోండి అంటూ వారి మీద సానుభూతి చూపించారు. దీంతో..వారిద్దరి హోదాలు.. వారికి ఇవ్వాల్సిన గౌరవం.. సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా అటు కార్మికుల్లో..ఇటు ప్రజల్లో వచ్చే మైలేజ్ అంచనా వేసారు.అంతే..నిర్ణయం ప్రకటించారు. అదే సమయంలో కార్మికుల గురించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే సానుభూతి చూపించారంటూ..అక్కడ మరో పేరు మాత్రం ప్రస్తావించలేదు.
అసలు లక్ష్యం... మున్సిపల్ ఎన్నికలు..!
ముఖ్యమంత్రి గురువారం రాత్రి ఇంత పెద్ద నిర్ణయం ప్రకటించి..తెలంగాణకు తాను తండ్రి లాంటివాడినంటూ చెప్పుకొచ్చారు. శుక్రవారం హైకోర్టులో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అనుకూలం గా నిర్ణయం వలువడే అవకాశం ఉంది. దీంతో..ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజల్లో ఏర్పడ్డ వ్యతిరేకత..కార్మికుల కుటుంబాల్లో గూడు గట్టుకున్న ఆవేదనను..తన మంచితనం..పెద్దరికం.. అనే పేర్లతో తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసారు. కార్మికులను మాత్రం తన వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అయ్యారు. అదే సమయంలో యూనియన్లు..ప్రతిపక్షాలకు ఊహించని దెబ్బ కొట్టారు. ఇక, తన మీద ఈ నిర్ణయం ద్వారా అనుకూలంగా చర్చ జరిగే సమయంలోనే మున్సిపల్ ఎన్నికల నగారా మోగించాలని భావిస్తున్నారు. శుక్రవారం..లేదా శనివారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
మంత్రులకు షాక్ ఇచ్చేలా..
ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన సమయం నుండి కార్మిక సంఘాల విషయంల కఠినంగా వ్యవహరించారు. అసలు మంత్రులు దీని పైన స్పందించవద్దని..తానే చూసుకుంటానని స్పష్టం చేసారు. అటువంటిది అసలు ప్రయివేటీకరణ రిటైర్ అయిన కార్మికులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నామని..కొందరు కార్మికులకు తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ పైన ముఖ్యమంత్రి తీరుతో ప్రజల్లో వ్యతిరేకత..రాజకీయంగా నష్టపోతున్నామని లోలోపల మధన పడుతున్న మంత్రులకు సైతం కేసీఆర్ షాక్ ఇచ్చేలా నిర్ణయం ప్రకటించారు. కార్మికులకు తిరిగి ఉద్యోగాలు వచ్చేసాయి..కేసీఆర్ ఆశించిన స్థాయిలో కాకున్న పొలిటికల్ మైలేజ్ కనిపిస్తోంది. అదే సమయంలో ప్రయాణీల జేబులకు మాత్రం సమ్మె సమయంలోనూ..ఇప్పుడూ జేబులకు చిల్లు తప్పటం లేదు.