TRS MPs To Resign: ముహూర్తం ఫిక్స్..!! రేవంత్ - బండి సమర్ధతకు సవాల్ :కేసీఆర్ ప్లాన్ గెలిచేనా..!!
తెలంగాణలో మరో సారి ఎన్నికలు రాబోతున్నాయా. ప్రస్తుతం పరిస్థితుల్లో కేసీఆర్ తన బలం చాటుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా. అందు కోసం డేరింగ్ డెసిషన్ దిశగా కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తీరుపై ఇక ప్రజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతూ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నా టీఆర్ఎస్ పార్టీ, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్రంపై యుద్దంలో భాగంగా
ఇకపై కేంద్రంతో పోరుబాటులోనే నడవాలని, 'హమారా నారా(నినాదం).. మోదీ సర్కార్ జానా' నినాదంతో ఉద్యమించాలని నిర్ణయించింది. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతి రేక విధానాలను ప్రజల్లోనే ఎండగడతామంటూ ఎంపీలంతా హైదరాబాద్ తిరిగి వెళ్లారు. అయితే, ఇంకా దాదాపుగా పదిహేను రోజుల పాటు సమావేశాలు ఉన్నా..అప్పటి వరకు వేచి చూడకుండా సమావేశాలు బహిష్కరించటం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. 'ధాన్యం సేకరణపై ఎన్నివిధాలా నిరసనలు తెలపాలో, ఎన్ని విధాలుగా పోరాడాలో అంతా చేశామని పార్లమెంటరీ పార్టీ నేతల కేశవరావు చెప్పారు. ఎంతచేసినా గోడకు తలబాదుకున్నట్లుగా ఉంది తప్ప స్పందించే వారే లేరన్నారు.
రాజీనామాలతో లాభ నష్టాలపై తుది కసరత్తు
ఇది ఫాసిస్టు ప్రభుత్వమంటూ ఆరోపించారు పార్లమెంట్లో ఈ అంశం తేలదని భావించి సమావేశాలను బహిష్కరిస్తున్నామని చెబుతూనే.. రైతు వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజల్లోకి వెళతామని వెల్లడించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పిన కేశవరావు... రాజీనామాలు చేసే విషయం ఆలోచిస్తామని పరోక్షంగా తమ వ్యూహాన్ని బయట పెట్టారు. హుజూరాబాద్ ఫలితం తరువాత ప్రజల్లో టీఆర్ఎస్ బలం గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అది మరింతగా కొనసాగకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్ వరి అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర తీరును నిరసిస్తూ దీక్ష చేసారు. పార్లమెంట్ లో ఎంపీలు ఆందోళన నిర్వహించారు.
రాజీనామాల దిశగా ఆలోచనలు..
కేంద్రంతో సంప్రదింపులు చేసినా.. ఫలితం లేదంటూ..తెలంగాణలో టీఆర్ఎస్ మాత్రమే రైతుల పక్షాల నిలుస్తుందని చెప్పే ప్రయత్నం చేసారు. ఇక, ఇప్పుడు తమకు తిరుగులేదనే విధంగా వ్యవహరిన్న బీజేపీకి...రేవంత్ రాకతో బలపడ్డామని భావిస్తున్న కాంగ్రెస్ కు సవాల్ విసిరేందుకు కేసీఆర్ సిద్దమైనట్లు తెలుస్తోంది. తన లోక్ సభ ఎంపీలతో రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్లాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఇందుకోసం డిసెంబర్ 9 ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రకటన చేసిన డిసెంబర్ 9న కేంద్ర తీరుకు రాజీనామా చేయటం ద్వారా సెంటిమెంట్ కలిసి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
తిరిగి గెలుస్తారనే ధీమాతో ముందుడుగు
అయితే, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు..బీజేపీ నాలుగు లోక్ సభ సీట్లు గెలుచుకున్నాయి. మరో రెండేళ్ల కాలంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. గ్రేటర్ తో పాటుగా.. దుబ్బాక.. హుజూరాబాద్ లో బీజేపీ గెలిచింది. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ పార్టీ నేతలు చెబుతున్నట్లుగా రాజీనామాల పైన డేరింగ్ నిర్ణయం తీసుకుంటారా అనే సందేహం సైతం వ్యక్తం అవుతోంది. కేసీఆర్ డేర్ చేసి ముందుకెళ్లినా..ఫలితాలు ఎలా ఉంటాయనేది మరో ఆసక్తి కరమైన చర్చ. అయితే, దీని పైన ఇప్పటికే సర్వేలు సైతం చేయించినట్లు చెబుతున్నారు. రాజీనామాల దిశగానే నిర్ణయం ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
Recommended Video
కేసీఆర్ తుది నిర్ణయం పై ఉత్కంఠ
అయితే, ఎంపీలు రాజీనామాలు చేస్తే..వాటిని స్పీకర్ వెంటనే ఆమోదిస్తారా లేదా అనేది మరో చర్చ. ఆమోదిస్తే..వచ్చే అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగానే ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో తమ ఎంపీలను గెలిపించుకుంటే కేసీఆర్ కు సార్వత్రిక ఎన్నికల ముందు మరింత బలం పెంచటం ఖాయం. ఫలితాలు అనుకూలంగా రాకపోతే.. ఏం జరుగుతుందనేది మరో ఆసక్తి కర చర్చగా మారుతోంది. ఇప్పుడు కేసీఆర్ నిర్ణయం పైన పార్టీ నేతల్లోనే కాదు... రాజకీయంగా అందరిలోనూ ఉత్కంఠ పెరుగుతోంది. మరి..ముఖ్యమంత్రి నిర్ణయం ఏంటనేది గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.