ఫాంహౌజ్కు వెళ్తూ..: కారు ఆపి మరీ.. కేసీఆర్ వస్తారని వాళ్లు ఊహించలేదు?
నిజానికి రాజీవ్ రహదారి మార్గంలో కేసీఆర్ తన ఫామ్హౌజ్కు చేరుకోవాల్సిన ఉన్నా.. ఈసారి ఆయన రూట్ మార్చారు.
హైదరాబాద్: ఫాంహౌజ్ రాజకీయాలంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను పదునైన వ్యాఖ్యలతో కేసీఆర్ తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఎంజాయ్ చేయాలనుకుంటే.. హైదరాబాద్ లోనే ఎన్నో గెస్ట్ హౌజ్లు ఉన్నాయని, అక్కడిదాకా వెళ్లాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఫామ్ హౌజ్ అంటే తనకు ఇల్లు లాంటిదని అందుకే తరుచూ అక్కడికి వెళ్లి వస్తుంటానని బుధవారం ప్రెస్మీట్లో వెల్లడించారు.
ప్రెస్మీట్ పెట్టిన మరుసటి రోజే ఆయన ఫామ్హౌజ్ బాట పట్టారు. వెళ్తూ.. వెళ్తూ.. మధ్యలో తన కారు ఆపి మరీ.. జనంతో ముచ్చటించారు. ప్రభుత్వ పథకాలు, అధికారుల పనితీరు, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనుకోకుండా సీఎం తమ వద్దకు రావడంతో.. అక్కడి ప్రజలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
నిజానికి రాజీవ్ రహదారి మార్గంలో కేసీఆర్ తన ఫామ్హౌజ్కు చేరుకోవాల్సిన ఉన్నా.. ఈసారి ఆయన రూట్ మార్చారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం అలియాబాద్-లక్ష్మాపూర్ దారిలో వెళ్లారు. దీంతో సీఎం కాన్వాయ్ను చూసేందుకు ఆయా గ్రామాల జనం రోడ్ల మీదకు వచ్చారు. జనం రోడ్ల మీదకు రావడం గమనించి.. కేసీఆర్ తన కాన్వాయ్ అక్కడ ఆగేలా చేశారు.
కారు నుంచి బయటకు దిగి అక్కడివాళ్లతో ముచ్చటించారు. మిషన్ భగీరథ గురించి అడిగి తెలుసుకున్నారు. పేకాట సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయా? అని ఆరా తీశారు. కరెంటు సరఫరా మంచిగా జరుగుతుందా? అని అడిగారు. అలాగే 24గం. విద్యుత్ సరఫరా ఇస్తే ఎలా ఉంటుందని వారిని సలహా అడిగారు.
రైతులకు 15గం. నిరంతరాయ విద్యుత్ ఇస్తే బాగుంటుందని, 24గం. అయితే మోటార్లు కాలిపోతాయని అక్కడి ప్రజలు సీఎంకు బదులివ్వడం గమనార్హం. సీఎం రాకపై హర్షం వ్యక్తం చేసిన అక్కడి ప్రజలు.. తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కూడా కోరారు. అయితే సీఎం మాత్రం ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. దానికి బదులు ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ది జరిగేలా చేస్తామని హామి ఇచ్చారు.