రెండో శాసన సభ ఏర్పాటుపై గెజిట్ నోట్ విడుదల: కేసీఆర్ రాజీనామా ఆమోదం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాననే విషయం సాయంత్రం చెబుతామని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత తన ప్రమాణ స్వీకారం ఖరారవుతుందని కేసీఆర్ కూడా చెప్పారు.
ఐటీ కారిడార్లోనూ చంద్రబాబుకు ఎదురుదెబ్బ, సుహాసినికి సీమాంధ్రులు షాకిచ్చారు
ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారయింది. రేపు (గురువారం) మధ్యాహ్నం గం.1.25 నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. కేసీఆర్తో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ రోజు తెలంగాణలో రెండో శాసనసభ ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం చట్టబద్ధ నోటిఫికేషన్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఈ రోజు తేదీతో గెజిట్ జారీ చేశారు.
1951 ప్రజాప్రాతినిథ్య చట్టం 73వ విభాగం ప్రకారం అసెంబ్లీకి ఆయా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన 119 మంది పేర్లను అధికారికంగా ప్రకటించారు. సభ్యులు ఎన్నికైన పార్టీల వివరాలను కూడా ఈ గెజిట్లో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషి ఆదేశాలకు అనుగుణంగా రజత్ కుమార్ తెలంగాణ రాజపత్రాన్ని జారీ చేశారు.
ఇదిలా ఉండగా, కేసీఆర్తో పాటు పదిహేడు మంది మంత్రులు రాజీనామా చేశారు. రేపు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కొత్త ప్రభుత్వం రానుంది కాబట్టి రాజీనామా చేయాలి. ఈ రాజీనామాలను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు సీఎంగా కొనసాగాలని కేసీఆర్ను గవర్నర్ కోరారు. ఆ తర్వాత ఆయనే సీఎంగా ప్రమాణం చేయనున్నారు.