ముదనష్టపు కాంగ్రెస్, చిప్ప పట్టుకొని అడుక్కున్నారు: కేసీఆర్ నిప్పులు
హస్నాబాద్: హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విపక్షాలపై మండిపడ్డారు. అలాగే అసెంబ్లీ రద్దుకు గల కారణాలను తెలిపారు. ఎన్నికలు ఎందుకు వస్తున్నాయో నిన్న హైదరాబాదులో చెప్పానని అన్నారు. ఇక తన గురించి చెప్పే అవసరం సిద్దిపేట, హుస్నాబాద్లలో లేదన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనకు అనుబంధం ఉందని చెప్పారు. ఇది కొత్తకొండ ఈరన్న కొలువుదీరిన నేల అన్నారు. కెప్టెన్ లక్ష్మీకాంత రావు తనకు పెద్దన్నలాంటివారని చెప్పారు.
కేసీఆర్ మరో సంచలనం, 105 మంది అభ్యర్థుల ప్రకటన, వారికి మాత్రమే నో టిక్కెట్
తాను ప్రవేశపెట్టిన పథకాల గురించి డబ్బు కొట్టి చెప్పి, మిమ్మల్ని విసిగించదలుచుకోలేదని చెప్పారు. కొందరు నేతలు పిచ్చిపిచ్చి కూతలు కూస్తున్నరని చెప్పారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తే తాను గులాబీ కండువా కప్పి తెరాసకు ప్రచారం చేస్తానని జానారెడ్డి చెప్పారని, ఆయనకు నిజాయితీ ఉంటే ఇప్పుడు అలా చేయాలన్నారు. ముదనష్టపు, దరిద్రపుకొట్టి కాంగ్రెస్స్తో ఎంత నాశనం అయ్యామో హుస్నాబాద్ నిదర్శనం అన్నారు.
మీరేమైనా గంధర్వులా?
ఇప్పుడు పిచ్చికూతలు కూస్తున్న కాంగ్రెస్ నేతలు గంధర్వులా, కింపురుషులా, కిన్నెరులా, ఆకాశం నుంచి దిగి వచ్చారా అని కేసీఆర్ మండిపడ్డారు. ఈ దేశాన్ని 50 ఏళ్లు పాలించింది ఎవరో చెప్పాలన్నారు. వారి ముదనష్టపు, దరిద్రపుగొట్టు పాలన వల్ల హుస్నాబాద్ మాత్రమే కాకుండా భారతదేశం మొత్తం నష్టపోయిందన్నారు. కేసీఆర్ అసమర్థ విధానాలు, అవివేకం వల్ల దేశం ఎంతో నష్టపోయిందన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయస్థాయిలో వాహనాలు, రైళ్ల వేగాన్ని ఆయన ప్రస్తావించారు. కంటైనర్ల విషయంలోను మనం వెనుకబడి ఉన్నామని, దానికి బాధ్యులు కాంగ్రెస్ అన్నారు.
చిప్పపట్టుకొని పదవులు అడుక్కున్నారు
తెలంగాణ కాంగ్రెస్ నేతలు చిత్తశుద్ధితో ఉంటే తెలంగాణ పరిస్థితి ఇలా ఉండేది కాదని కేసీఆర్ అన్నారు. ఆంధ్రా నాయకుల వద్ద చిప్ప పట్టుకొని, పదవులు అడుక్కున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు. ఎన్నికలు వచ్చాయంటే అలవికానీ వాగ్ధానాలు చేస్తారన్నారు. తెరాస పాలన ప్రజలకు భరోసా ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు సిగ్గుపడాలన్నారు. కాంగ్రెస్ నేతలకు అభివృద్ధి కనబడం లేదా అన్నారు. యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైన వెయ్యి రూపాయల పింఛన్ ఇవ్వాలనుకున్నారా అన్నారు.
కాంగ్రెస్ నేతలది నోరా, మోరా
కాంగ్రెస్ నేతలది అసలు నోరా.. మోరియా అని కేసీఆర్ అన్నారు. ఉద్యమం సమయంలో చిత్తశుద్ధితో రాజీనామా చేసింది టీఆర్ఎస్ మాత్రమే అన్నారు. తెలంగాణలో 31 జిల్లాలు అవుతాయని ఎవరైనా కలలు కన్నారా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ.. ఇలా అన్నింట్లో అవినీతి అంటారని, కానీ చూపించరని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే ప్రజాక్షేత్రానికి రావడానికి ఎందుకు ఆగం అవుతున్నారని ప్రశ్నించారు. మన రాజకీయ ఆధిపత్యం మన చేతుల్లో ఉండాలన్నారు. ఈరోజు తెలంగాణలో ఏ సమస్యలు లేవని చెప్పారు.
మీ ఆశీర్వాదం కోసం వచ్చా
తాను మరోసారి మీ ఆశీర్వాదం కోసమే వచ్చానని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే కనుక మళ్లీ కరెంట్ కోతలతో సహా అన్ని సమస్యలు వస్తాయని చెప్పారు. రాష్ట్ర ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు చేశామన్నారు. తెలంగాణ తేకుంటే తనను రాళ్లతో కొట్టాలని ఆనాడు చెప్పానని, మీ ఆశీర్వాదంతో తెలంగాణ సాధించానని, ఈ రోజు మళ్లీ చెబుతున్నానని, మతకల్లోహాలు లేవని, కరెంట్ కష్టాలు లేవని, కాబట్టి ఆకుపచ్చ తెలంగాణ కోసం మళ్లీ తెరాసను గెలిపించాలన్నారు. ప్రాజెక్టులు రీడిజైనింగ్ చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు.