మోడీయే మట్టి తెచ్చారని నోర్మూసుకున్నా, ఏపీకి ఇస్తానంటే బాబు నవ్వారు: కెసిఆర్
హైదరాబాద్: గత ఏడాది దసరా పర్వదినం రోజున తాను అమరావతి శంకుస్థాపనకు వెళ్లినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ఇద్దామనుకున్నానని, కానీ ప్రధాని మోడీయే నీళ్లు - మట్టి తెచ్చారని, అందుకే తాను ఏమీ నోరు మూసుకొని వచ్చానని తెలంగాణ సీఎం కెసిఆర్ గురువారం అన్నారు.
నేను అమరావతి వెళ్లినప్పుడు నవ్యాంధ్రకు ఏమైనా ప్రకటించి వద్దామనుకున్నానని, కానీ ప్రధాని మోడీ నీళ్లు, మట్టి తీసుకు వచ్చారని, అలాంటప్పుడు నేను ఏమైనా ప్రకటన చేస్తే బాగుండదని ఊరుకున్నానని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు.
ప్రధాని మోడీయే నీళ్లు, మట్టి తెచ్చినప్పుడు నేను ఏమైనా ప్రకటిస్తే.. నా కన్నా గొప్పా అన్నట్లుగా ఉంటుందని, అందుకే నోరుమూసుకొని వచ్చానని చెప్పారు. ఈ విషయం ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా చెప్పానని, పాపం ఆయన నవ్వారన్నారు. అమరావతి పైన నేను రాజకీయం చేయలేదన్నారు.
తమకు జర్నలిస్టులందరూ సమానమేనని సీఎం కెసిఆర్ చెప్పారు. తమకు కెమెరా జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లు ఇలా లేవన్నారు. అందరూ సమానమే అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కంటే మంచివి కట్టిస్తామని కెసిఆర్ చెప్పారు. మీ ఓట్లు కూడా తెరాస అభ్యర్థులకు వేయమని కోరుతున్నానని కెసిఆర్.. జర్నలిస్టులను కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక నగరంలోని పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రాజధానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లో త్వరలో ఐలాండ్ విద్యుత్ వ్యవస్థ రూపొందించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా రెప్పపాటు కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగదన్నారు.