ఆ విషయం ఫోన్ చేసి చెప్పారు: బాబుపై కేసీఆర్ సంచలనం, జానారెడ్డిపై నిప్పులు
నల్గొండ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నల్గొండలో ప్రజా ఆశీర్వాద సభలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు గతంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని, కానీ తనకు మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ ఫోన్ చేసి కుట్ర గురించి చెప్పారని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కోసం మీరొక్కరే పోరాడారని, ఇప్పుడు కలిసి పోరాడుదామని తనకు అసదుద్దీన్ ధైర్యం చెప్పారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్న కుట్రదారున్ని చంద్రబాబును ఇక్కడకు తీసుకు వస్తారా అని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఇటీవల ఓ సర్వేలో తెరాస అద్భుత విజయం సాధిస్తుందని తేలిందని చెప్పారు.
అడ్డమైన దొంగ చంద్రబాబుతో పొత్తా, తూ.. మీ బతుకు చెడా: కేసీఆర్ తిట్లదండకం
110 స్థానాల్లో తెరాస గెలుపు
తనకు తాజాగా ఓ సర్వే రిపోర్ట్ వచ్చిందని, 119 నియోజకవర్గాల్లో 7 సీట్లు మజ్లిస్ పార్టీకి పోతే, విపక్షాలు రెండు స్థానాల్లో మాత్రమే గెలుస్తాయని, 110 స్థానాల్లో తెరాసనే గెలుస్తుందని తేలిందని చెప్పారు. ఎన్నికలు ఎందుకు వచ్చాయో తాను ఇప్పటికే చెప్పానని తెలిపారు. ప్రజల సహకారంతో 2001 ఎగిరిన గులాబీ జెండా ముందుకు సాగుతోందన్నారు. తాను తెలంగాణను ఎత్తుకున్నప్పుడు అవమానాలు, విమర్శలు ఎదురయ్యాయని చెప్పారు. అవమానాలు, విమర్శలు ఎదుర్కొని, ఎత్తిన జెండా దించకుండా ముందుకు సాగామన్నారు. నల్లగొండా జిల్లాతో తనకు ఓ ఉద్వేగభరిత సంబంధం ఉందని చెప్పారు. తెరాసను నల్గొండ గెలిపించిందని చెప్పారు.
కాంగ్రెస్ నేతలకు లాగులు తడుస్తాయి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబుకు గులాములు అయితే, కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాములు అని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఢిల్లీని చూస్తే కాంగ్రెస్ పార్టీకి లాగులు తడుస్తాయన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ నేతలు కేసులు వేశారన్నారు. డిజైన్లలో లోపం ఉంటే అసెంబ్లీలో చెప్పాలన్నారు. కాంగ్రెస్ తెలంగాణకు శాపం అన్నారు. దక్షిణ తెలంగాణలో ఒక్క విద్యుత్ శక్తి ప్రాజెక్టు లేదన్నారు. నేను చెప్పేది అబద్దమైతే ఒక్క ఓటు వేయకుండా ఓడగొట్టాలని సవాల్ చేశారు.
పెద్ద మాటలు మాట్లాడే చెత్త నాయకులు నల్గొండ జిల్లాలో
పెద్దపెద్ద మాటలు మాట్లాడే చెత్త నాయకులు అందరూ నల్గొండ జిల్లాలోనే ఉన్నారని కేసీఆర్ విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలియదని, ఆయనను చూస్తే జాలి వేస్తోందన్నారు. తెలంగాణకు మొదటి నుంచి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. జానారెడ్డి పార్టీ పెడితే మంత్రి పదవి కోసమే పెట్టారని తాను చేరలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న జానారెడ్డి జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కాలేదన్నారు. తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ వన్ పోలీస్గా రూపుదిద్దుకుంటోందన్నారు. ఒక్కో రంగంలో ఊహించని మార్పులు వస్తుంటే, కాంగ్రెస్ పార్టీవి పనికిమాలిన ఆలోచనలు అన్నారు.
కాంగ్రెస్ గొర్రెలు
రైతాంగానికి ఒక్క నిమిషం కరెంట్ పోకుండా 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణే అన్నారు. చిరు ఉద్యోగులకు గౌరవప్రదమైన జీతాలు పెంచామని చెప్పారు. 14 నిరంతరం పోరాడి తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. గొల్ల కురుమలకు గొర్రెలు ఇస్తే, కాంగ్రెస్ గొర్రెలు.. గొర్రెలే ఇస్తారా అని మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తామన్న హామీ నెరవేరబోతోందన్నారు. తాము డిప్ ఇరిగేషన్ను ప్రోత్సహించామని చెప్పారు. అన్ని కులవృత్తుల వారినీ ప్రోత్సహించామని చెప్పారు.