మేం అలా: చంద్రబాబు పథకాన్ని గుర్తుచేసిన కెసిఆర్, మా నాన్న డాక్టర్ని చేయాలని..
మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గత స్మృతులు గుర్తు చేసుకున్నారు. ఆయన సోమవారం దుబ్బాకలో పర్యటించారు. ఈ సందర్భంగా సమైక్య ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి జన్మభూమి పథకాన్ని గుర్తు చేసుకున్నారు.
దుబ్బాకలో కెసిఆర్ మాట్లాడుతూ... జన్మభూమి కార్యక్రమంలో మెదక్ జిల్లా ముందంజలో ఉండేదని చెప్పారు. అధికారులతో ప్రేమతో మెలిగి తాము పనులు చేయించుకునేవాళ్లమని చెప్పారు. ప్రేమతో మెలిగి వారితో పనులు చేయించుకోవాలని సూచించారు.
మా నాన్న కలెక్టర్ లేదా ఇంజినీర్ని చేయాలని కల కన్నాడు
తన తండ్రి తనను ఇంజినీర్ని లేదా డాక్టర్ను చేయాలని కలలు కన్నారని సీఎం కెసిఆర్ అన్నారు. తనకు తెలుగు సాహిత్యమంటే అభిమానమని చెప్పారు.
త్వరలో ఆత్మీయులకు విందు
త్వరలో తాను ఆత్మీయులకు విందు ఇస్తానని కెసిఆర్ చెప్పారు. తనను పిలిచి విందు ఇచ్చిన ఆత్మీయులకు కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.
దుబ్బాకలో బాల్యమిత్రులను పేరుపేరునా పలకరించిన కెసిఆర్
దుబ్బాకలో పర్యటించిన కెసిఆర్ తన బాల్యమిత్రులను కలిసి పేరుపేరునా పలకరించారు. తనకు తెలుగు సాహిత్యమంటే చాలా ఇష్టం, అభిమానమని చెప్పారు. తెలంగాణ సిద్ధిస్తే మా నీళ్లు మాకు వస్తాయని నేను చెప్పినవి అక్షర సత్యాలు అయ్యాయని చెప్పారు.
మెదక్ జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తానని చెప్పారు. దుబ్బాక పట్టణ అభివృద్ధికి కమిటీని వేయాలన్నారు. పాఠశాల, కళాశాలను అద్భుతంగా నిర్మిస్తామని చెప్పారు. దుబ్బాకకు అద్భుతమైన పార్క్ కావాలని, ఇందుకోసం భూసేకరణ చేయాలన్నారు.
తెలంగాణకు విద్యుత్ బాధ పోయిందన్నారు. ఏప్రిల్ నుంచి పగటిపూటనే రైతాంగానికి విద్యుత్ ఇస్తామని చెప్పారు. వంద శాతం కలలుగన్న తెలంగాణ సాకారమైందన్నారు. రామసముద్రం చెరువును ట్యాంక్ బండ్లా చేయాలన్నారు.
దుబ్బాకకు వరాలు
దుబ్బాకకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. దుబ్బాకలో ఉన్నత పాఠశాల నూతన భవనానికి, రామసముద్రం చెరువు సుందరీకరణ, 33/11 కేవీ సబ్స్టేషన్కు సీఎం శంకుస్థాపన చేశారు. దుబ్బాకలో హైస్కూల్, జూనియర్ కళాశాల నిర్మాణానికి రూ. 10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు. దుబ్బాకకు 100 పడకల ఆస్పత్రి మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
దుబ్బాక డిపోకు కొత్త బస్సులు, దుబ్బాకకు ఫైర్ స్టేషన్ మంజూరు, దుబ్బాక నియోజకవర్గంలో 10 వేల మంది మహిళలకు దీపం పథకం కింద కొత్త కనెక్షన్లు ఇస్తామన్నారు. దుబ్బాక నియోజకవర్గానికి అవసరమైనన్ని కొత్త సబ్స్టేషన్లు మంజూరు చేస్తామని, నియోజకవర్గంలో షాదీఖానా ఏర్పాటు చేస్తామని, రూ.5 కోట్లతో టౌన్హాల్ ఏర్పాటు చేస్తామన్నారు.
దుబ్బాకలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3కోట్ల విరాళం ప్రకటించారు.