కోదండరామా? ఎవరాయనా?: కేసీఆర్ వింత స్పందన, నల్గొండ ఉపఎన్నికపై ఇలా
హైదరాబాద్: గత కొంత కాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న జేఏసీ ఛైర్మన్ కోదండరాంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్రవారం ప్రగతిభవన్లో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కోదండరాం ఎవరో తెలియదన్నట్లుగా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కోదండరామా?
‘ఓట్ల కోసం మాటలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కోదండరాం.. ఎవరాయన? తాడు, బొంగరం లేనివాళ్లు ఏదేదో మాట్లాడుతారు' అంటూ ధ్వజమెత్తారు. తాము చెప్పింది చేస్తామని, ఉద్యోగాల కోసం కొత్త భూగర్భగనులు ప్రారంభిస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఉద్యమంలో కీలకంగా కోదండరాం..
అయితే, తెలంగాణ ఉద్యమంలో రాజకీయ జేసీఏ ఛైర్మన్గా కోదండరాం కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. ఉద్యోగ సంఘాలను, ప్రజలను సమన్వయం చేస్తూ ఉద్యమంలో తన వంతుగా ఉద్యమంలో ముందుకు కదిలారు. ఆ సమయంలో కేసీఆర్, టీఆర్ఎస్ శ్రేణులు కూడా కోదండరాంకు అండగా నిలబడ్డాయి.
కోదండరాం విమర్శలు..
అయితే, గత సంవత్సర కాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోదండరాం విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే స్థాయిలో కోదండరాంను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.
నల్గొండ ఉపఎన్నికపై..
ఇది ఇలావుండగా, కొద్దికాలంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్న నల్గొండ ఎంపీ స్థానం ఉపఎన్నికపై కూడా సీఎం కేసీఆర్ స్పందించారు. ‘నల్గొండ ఉపఎన్నిక వస్తుందో, రాదో తెలియదు. ఒక వేళ వస్తే.. టీఆర్ఎస్ గెలుపు ఖాయం' అని కేసీఆర్ స్పష్టం చేశారు.