సమర్థుడైన ముఖ్యమంత్రిగా కెసిఆర్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకభూమిక పోషించారు టిఆర్ఎస్ అదినేత కెసిఆర్.తొలి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.2014 లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కెసిఆర్ కీలకంగా వ్యవహరించారు.
Recommended Video
దేశంలోని కొత్త రాష్ట్రం తెలంగాణను వివిధ రంగాల్లో అగ్రభాగాన నిలపడానికి చేస్తున్న కృషి ద్వాారా సమర్థుడైన పాలకుడిగా పేరు పొందారు. హైదరాబాదులో జిఈఎస్ నిర్వహణ, మెట్రో రైలు ప్రారంభం వంటి వాటిని విజయవంతంగా నిర్వహించడమే కాకుండా ప్రపంచ తెలుగు మహాసభలను గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించారనే కీర్తిని కూడా సంపాదించుకున్నారు. దక్షిణాది ముఖ్యమంత్రుల్లో హిందీ మాట్లాడగలిగే ఏకైక సిఎంగా కూడా ఆయనకు పేరుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు, అభివృద్ది కార్యక్రమాలను సమన్వయం చేసుకొంటూ బంగారు తెలంగాణ సాధన దిశగా కెసిఆర్ పాలన సాగిస్తున్నారు. కెసిఆర్ ప్రారంభించిన కొన్ని పథకాలు ఇతర రాష్ట్రాలు, కేంద్రం కూడ మెచ్చుకొన్న సందర్భాలు కూడ లేకపోలేదు.
1985లో తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సిద్దిపేట ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున గెలుపొందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 2001లో తెలంగాణ ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) స్థాపించారు
ఆనాటి నుంచి 2014 వరకు రకరకాల ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. 2004లో కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో 25 అసెంబ్లీ, ఐదు లోక్ సభ.. 2009లో టీడీపీ, వామపక్షాల మద్దతుతో 10 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాలు గెలుచుకున్నారు. 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ సాధించారు.
ఆనాటి నుంచి బంగారు తెలంగాణ సాధన కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. సాహితీవేత్తగా, గోదావరి జలాలను తెలంగాణ అంతటా మళ్లించేందుకు 'అపర భగీరథుడి'గా వ్యవహరిస్తున్నారు. భిన్నమైన విధానాలతో సబ్బండ వర్ణాలకు అండగా నిలుస్తామంటున్నారు.