ఫ్రంట్ ప్రయత్నాల్లో జోరు పెంచిన కేసీఆర్.. సాయంత్రం స్టాలిన్తో భేటీకానున్న సీఎం..
ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడుతుండటంతో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో జోరు పెంచారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ప్రాంతీయ పార్టీల సత్తా చాటడమే లక్ష్యంగా వ్యూహాలకు పదనుపెట్టిన కేసీఆర్.. వాటిని వివిధ పార్టీల నాయకులతో పంచుకునేందుకు ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. ఇందులో భాగంగా తమిళనాడులో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి ఇవాళ డీఎంకే అధినేత స్టాలిన్తో భేటీ కానున్నారు.
ఫ్రంట్కు ముందడుగు : రేపు స్టాలిన్తో కేసీఆర్ భేటీ
సాయంత్రం స్టాలిన్తో భేటీ
ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు, ఎంపీలు వినోద్ కుమార్, కేశవరావు, సంతోష్ కుమార్లతో కలిసి ప్రత్యేక విమానంలో కేసీఆర్ చెన్నై చేరుకున్నారు. శ్రీరంగం, తిరుచ్చి ఆలయాల సందర్శన అనంతరం సాయంత్రం 4.30గం.లకు సీఎం కేసీఆర్.. డీఎంకే ప్రెసిడెంట్ స్టాలిన్తో భేటీ కానున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వ్యవహరించాల్సిన తీరు, జాతీయ పార్టీలకు మద్దతు విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కీలకం కానున్న ప్రాంతీయ పార్టీలు
మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే కేంద్రంలో ఏ జాతీయ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, ప్రాంతీయ పార్టీలు సాధించే స్థానాలే కీలకంగా మారతాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయి. ఇదే విషయాన్ని కేసీఆర్, స్టాలిన్తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మద్దతు కోసం ప్రాంతీయ పార్టీల వద్దకే జాతీయ పార్టీలు వచ్చేలా అందరూ కలిసి ముందుకెళ్లాలని డీఎంకే అధినేతకు వివరించనున్నట్లు తెలుస్తోంది.
కూటమితో అధికార వికేంద్రీకరణ
దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటయ్యే కూటమి ద్వారా కేంద్రంలో చక్రం తిప్పే అవకాశముందన్న విషయాన్ని కేసీఆర్, స్టాలిన్తో ప్రస్తావించే అవకాశముంది. తద్వారా అధికార వికేంద్రీకరణ, రాష్ట్రాల హక్కులు, ప్రయోజనాలు ఎలా సాధించుకోవచ్చన్న విషయాన్ని సీఎం, డీఎంకే అధినేతకు వివరించే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీల ఐకమత్యంతో వ్యవహరిస్తే.. జాతీయస్థాయి సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందన్న విషయం ఇరువురు నేతల భేటీలో ప్రస్తావనకు వచ్చే ఛాన్సుంది.
ప్రయత్నాల్లో జోరు పెంచిన కేసీఆర్
ప్రాంతీయ పార్టీల సత్తా చాటే లక్ష్యంతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ఎన్నికల ముందే ప్రారంభించారు. గతంలో కరుణానిధితో పాటు స్టాలిన్తో సమావేశమైన ఆయన ఫెడరల్ ఫ్రంట్ అంశంపై చర్చించారు. త్వరలో లోక్సభ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో కేసీఆర్ మరో దఫా నాయకులందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో జోరు పెంచారు. ఫ్రంట్ ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ సీఎం.. ఇటీవలే కేరళ సీఎం పినరయి విజయన్ను కలిశారు. కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో ఫోన్లో మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్లో భాగస్వామ్యులయ్యేందుకు వైసీపీ నేత జగన్, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ సహా పలు పార్టీలకు చెందిన నేతలు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశారు.