కెసిఆర్ చైనా పర్యటనకు ప్రత్యేక విమానం, ఖర్చులకు రూ.2 కోట్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు త్వరలో చైనాలో పర్యటించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారుల బృందంతో కలిసి ప్రత్యేక విమానంలో చైనా వెళ్తారు. విమానం అద్దె ఖర్చుల కోసం రూ.2,03,84,000లను మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ముఖ్యమంత్రి కెసిఆర్ చైనాలో పర్యటిస్తారు. ఇందుకోసం సిఆర్జే చార్టర్డ్ విమానం అద్దెకు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం రాష్ట్ర వైమానిక సంస్థ అధికారులకు సూచించింది.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ నెలలో చైనా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. చైనాలో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. పర్యటన సందర్భంగా సీఎంతో పాటు మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.